Suryakumar Yadav: టీ20లలో భారత నయా సారథి సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్లోనే టీమిండియాను గెలిపించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ 200కు పైగా పరుగులు చేసినా సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు ఇషాన్ కిషన్, రింకూ సింగ్ల వీరవిహారంతో భారత్.. మరో బంతి మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. భారత్ విజయం సాధించిన నేపథ్యంలో భారత దిగ్గజ సారథి ధోనీతో పాటు రోహిత్, కోహ్లీల వల్ల సాధ్యం కాని అరుదైన పీట్ను సూర్య సాధించాడు. అదేంటంటే..
20 ఓవర్ల ఫార్మాట్లో భారత్కు సారథ్యం వహించిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రెండో సారథి సూర్యకుమార్ యాదవ్. నిన్నటి మ్యాచ్లో సూర్య.. 42 బంతుల్లోనే 9 బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. తద్వారా అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ జాబితాలో ఇంతకుముందు జస్ప్రిత్ బుమ్రా పేరిట ఈ రికార్డు ఉండేది. బుమ్రా.. ఈ ఏడాదిలోనే ఐర్లాండ్ పర్యటనలో భాగంగా తాను సారథిగా వ్యవహరించిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
2007 నుంచి మొదలైన భారత టీ20 ప్రయాణంలో సూర్య 13వ సారథి. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, రుతురాజ్ గైక్వాడ్ (ఆసియా క్రీడలలో) భారత్కు సారథిగా వ్యవహరించారు. కానీ వీరిలో బుమ్రా మినహా ఏ సారథి కూడా కెప్టెన్గా ఆడిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోలేదు.