Vilas Godbole : భారతజట్టు మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థి బౌలర్లకు హడలే. తన కెరీర్లో మాస్టర్ బ్లాస్టర్ తన క్లాస్ షాట్లతో వరల్డ్ క్లాస్ బౌలర్లను బెంబేలిత్తించాడు. అయితే.. సచిన్ కంటే యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా ప్రమాదకరం అని అతని మాజీ కోచ్ విలాస్ గోడ్బోలె అన్నాడు. ‘నేను సునీల్ గవాస్కర్, సచిన్ టెండూర్కర్ ఆటను చాలా దగ్గర నుంచి చూశాను. అయితే.. సూర్యకుమార్లా విధ్యంసం సృష్టించగల ప్రత్యేక క్రికెటర్ను చూడలేదు. గొప్ప ప్లేయర్లకు బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తారో ముందుగానే తెలుస్తుంది. సునీల్ గవాస్కర్, సచిన్ తాము ఆడినన్ని రోజులు అదే చేశారు. కానీ, సూర్యకుమార్ మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. అతను వికెట్ల వెనక్కి కూడా బంతిని అవలీలగా బాదగలడు’ అంటూ విలాస్ తెలిపాడు. సూర్య అండర్-22 టీమ్లో ఉన్నప్పుడు విలాస్ అతనికి కోచ్గా ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్లో కళ్లు చెదిరే షాట్లతో సూర్యకుమార్ ఆకట్టుకున్నాడు. పోయిన ఏడాది అతను వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సాధించాడు. అంతేకాదు 2022లో వెయ్యి పరుగులు చేసిన భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సూర్య కొత్త ఏడాదిలో తన సొంత మైదానం అయిన వాంఖడేలో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. శ్రీలంకతో ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.