ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు అభిమానులను కట్టిపడేసింది. తమకు కొట్టిన పిండిలాంటి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తిరుగులేదని చాటిచెప్పింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో ముంబై అద్భుత విజయం సొంతం చేసుకుంది. 200 పరుగుల లక్ష్యఛేదనలో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగితే నెహాల్ వదేరా అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కాడు. బెంగళూరు బౌలర్లను సూర్యకుమార్ చెడుగుడు ఆడుకుంటూ బాదిన బౌండరీలకు వాంఖడే హోరెత్తిపోయింది. గత నాలుగు మ్యాచ్ల్లో 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ముంబై మూడుసార్లు అలవోకగా ఛేదించి తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది.
ముంబై: ముంబై ఇండియన్స్ దూసుకొస్తుంది. లీగ్ తొలి దశలో వరుస ఓటములతో ఒకింత వెనుకబడిన ముంబై జూలు విదిల్చింది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన సందర్భంలో ఈ మాజీ చాంపియన్ పోరాడుతున్న తీరు అభిమానులకు ఫుల్ మజాను అందిస్తున్నది. మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఏకంగా ఎనిమిదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 83, 7ఫోర్లు, 6 సిక్స్లు), నేహాల్ వదెరా(52 నాటౌట్) అర్ధసెంచరీలతో విజృంభించారు. ఇషాన్కిషన్(42) మెరుగైన శుభారంభాన్ని అందించగా, కెప్టెన్ రోహిత్శర్మ(7) మరోమారు నిరాశపరిచాడు. హసరంగ, విజయ్కుమార్ విశాక్ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు మ్యాక్స్వెల్(33 బంతుల్లో 68, 8ఫోర్లు, 4 సిక్స్లు), డుప్లెసిస్(41 బంతుల్లో 65, 5ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలతో ఆర్సీబీ 20 ఓవర్లలో 199/6 స్కోరు చేసింది. బెహ్రెన్డార్ఫ్(3/36) మూడు వికెట్లు తీశాడు. విధ్వంసకర ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకమైన సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
బెంగళూరు: 20 ఓవర్లలో 199/6 (మ్యాక్స్వెల్ 68, డుప్లెసిస్ 65, బెహ్రెన్డార్ఫ్ 3/36, గ్రీన్ 1/15), ముంబై: 16.3 ఓవర్లలో 200/4 (సూర్యకుమార్ 83, నేహాల్ 52, విజయ్కుమార్ 2/37, హసరంగ 2/53)