Suresh Raina : సురేశ్ రైనా.. భారత క్రికెట్లో ఎప్పటికీ గుర్తిండిపోయే పేరు. ఆల్రౌండర్గా లోయర్ ఆర్డర్లో అతని బ్యాటింగ్ విన్యాసాలను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. కళ్లు చెదిరే సిక్సర్లు బాదిన అతను క్రికెట్కు వీడ్కోలు పలికి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. అయితే.. అతను ఆటకు గుడ్ బై చెప్పడానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. తన వీడ్కోలుపై ఇన్ని రోజులుగా నోరు విప్పని రైనా తాజాగా స్పందించాడు. తాను ధోనీ కోసం క్రికెట్ ఆడానని, ఆ తర్వాత దేశం కోసం బరిలోకి దిగానని భారత జట్టు మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా అన్నాడు. తాజాగా స్పోర్ట్స్ టాక్తో మాట్లాడిన రైనా తన నిర్ణయం వెనక కారణం వెల్లడించాడు. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోనీతో తనకున్న అనుబంధం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
నేను అదృష్టవంతుడిని
‘మేమిద్దరం కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడాం. అతడితో కలిసి భారత జట్టుకు, చెన్నై సూపర్ కింగ్స్కు ఆడినందుకు నేను అదృష్టవంతుడిని. నేను ఘజియాబాద్ నుంచి వచ్చాను. ధోనీ రాంచీ నుంచి వచ్చాడు. నేను ధోనీ కోసం ఆడాను. ఆ తర్వాత దేశం కోసం ఆడాను. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. మేమిద్దరం ఎన్నో ఫైనల్స్ ఆడాం. వరల్డ్ కప్ గెలిచాం. అతను గొప్ప నాయకుడు. అంతేకాదు ఉన్నత విలువలు ఉన్న మనిషి’ అని రైనా తెలిపాడు.
అరగంటలోనే నిర్ణయం..
చిన్న తాలాగా పేరొందని రైనా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో, ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెంటనే ఆటకు గుడ్ బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2020 ఆగష్టు 15వ తేదీన ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి నిర్ణయంతో షాక్లో ఉన్న ఫ్యాన్స్కు అరగంటలోనే మరో షాకింగ్ న్యూస్. క్రీకెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు రైనా వెల్లడించాడు. తాను ఆటకు అల్విదా చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదని అతను అన్నాడు.
13 ఏళ్ల కెరీర్.. ఎన్నో విజయాలు
టీమిండియాకు దొరికిన బెస్ట్ ఆల్రౌండర్స్లో రైనా ఒకడు. ఎడమ చేతివాటం బ్యాటర్గా, ఆఫ్ స్పిన్నర్గా, చురుకైన ఫీల్డర్గా అతను జట్టుకు ఎంతగానే ఉపయోగపడ్డాయి. రైనా 2018లో చివరి వన్డే ఆడాడు. 13 ఏళ్ల కెరీర్లో రైనా భారత జట్టు తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. అతను యువరాజ్ సింగ్, ధోనీతో కలిసి ఫినిషర్గా ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. వాటిలో 2011 వరల్డ్ కప్ విజయం మాత్రం ఎంతో ప్రత్యేకం. ఈ స్టార్ ఆల్రౌండర్ 2021లో ఐపీఎల్ చివరి టోర్నీ ఆడాడు. అయితే.. 2022 వేలంలో అతడు పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. కానీ, కనీస ధర రూ.2 కోట్లు ఉండడంతో అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.