హైదరాబాద్, ఆట ప్రతినిధి: నిత్యం విధుల్లో తీరికలేకుండా ఉండే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ క్రికెట్లో మెరుపులు మెరిపించారు. యువకులకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తూ పరుగుల వరద పారించారు. హెచ్సీఏ ఏ-త్రీ డివిజన్ వన్డే లీగ్ లీగ్ టోర్నీలో బాయ్స్ టౌన్తో జరిగిన మ్యాచ్లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆనంద్(88 బంతుల్లో 151 నాటౌట్)సూపర్ సెంచరీతో కదం తొక్కారు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతూ బౌండరీలతో చెలరేగారు. ఆనంద్కు తోడు సంజీవ్రెడ్డి(74 నాటౌట్), రాంబాబు (55) అర్ధసెంచరీలతో సికింద్రాబాద్ క్లబ్ నిర్ణీత 35ఓవర్లలో 339/4 స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో బాయ్స్ టౌన్ 25.1 ఓవర్లలో 109 పరుగులకే పరిమితమైంది. ఓవరాల్గా ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్లో ఐదు అజేయ సెంచరీలతో ఆనంద్ 828 పరుగులు చేశారు. దీనికి తోడు ఏడు ఇన్నింగ్స్ల్లో 11 వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్ అని నిరూపించుకున్నారు.