హైదరాబాద్, ఆట ప్రతినిధి: లక్నో(ఉత్తరప్రదేశ్) వేదికగా జరుగుతున్న 22వ జాతీయ జూనియర్ అండర్-20 ఫెడరేషన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్ సాయిసంగీత స్వర్ణ జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మహిళల 200మీటర్ల రేసును సంగీత 24.58 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచి పసిడి ఒడిసిపట్టుకుంది.
ఆది నుంచి తనదైన జోరు కనబరిచిన ఈ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ అథ్లెట్ సత్తాచాటింది. ఇదే విభాగంలో పోటీపడ్డ అభినయ రాజరాజన్(తమిళనాడు), మిస్తి కజ్లా(రాజస్థాన్) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇదే టోర్నీలో ఇప్పటికే సంగీత 400మీటర్ల రేసులో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.