ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్తో పాటు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. రాష్ట్రంలోని ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏల పరిధిలోని గిరిజన క్రీడాకారులతో పాటు ఇతర జిల్లాల నుంచి మొత్తం 1668 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన టోర్నీలో ఓవరాల్ చాంపియన్గా భద్రాచలం ఐటీడీఏ మొదటి స్థానంలో నిలిచింది. ఉట్నూరు ద్వితీయ స్థానం దక్కించుకోగా, ఏటూరునాగారం మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆయా జోన్ల వారీగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, గిరిజన సంక్షేమ విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ చందన మెమొంటోలు బహుకరించారు. మరోవైపు అథ్లెటిక్స్లో ఓవరాల్ విజేతగా ఉట్నూరు ఐటీడీఏ, ద్వితీయ స్థానంలో భద్రాచలం నిలిచాయి.
కబడ్డీ విజేత భద్రాచలం:
బాలికల అండర్-17 కబడ్డీలో భద్రాచలం విజేతగా నిలిచింది. ఏటూరునాగారం, ఉట్నూరు జోన్లు ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. అండర్-14 కేటగిరీలో భద్రాచలం టైటిల్ ఎగరేసుకుపోయింది. ఖోఖో అండర్-14 బాలికల విభాగంలో ఏటూరునాగారం, అండర్-17లో భద్రాచలం ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి. అథ్లెటిక్స్లో భద్రాచలం జట్టు అదరగొట్టింది. ముగింపు కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య, ట్రైనీ ఐఏఎస్లు రాధికా గుప్తా, శ్రీజ, ఫైజాన్ అహ్మద్తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.