హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక పారిస్(2024) లక్ష్యంగా ముందుకు సాగుతామని స్టార్ షట్లర్ సాత్విక్సాయిరాజ్ పేర్కొన్నాడు. ఇటీవలే ముగిసిన ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో సాత్విక్, చిరాగ్శెట్టి ద్వయం పసిడి పతకంతో చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ ఆసియాగేమ్స్ చరిత్రలో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. బుధవారం నగరానికి చేరుకున్న సాత్విక్సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్, రోహన్ కపూర్ను గోపీచంద్ అకాడమీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాత్విక్ మాట్లాడుతూ ‘ఆసియాగేమ్స్లో పసిడి పతకం సాధించడం మరిచిపోలేని సందర్భం. చిరాగ్తో కలిసి ఫైనల్లో అద్భుత పోరాట పటిమ కనబరిచాం. ఎక్కడా వెనుకడుగు వేయకుండా జోరు ప్రదర్శిస్తూ స్వర్ణం ఖాతాలో వేసుకున్నాం.
గెలిచిన తర్వాత డ్యాన్స్తో సంబురాల్లో మునిగిపోయాం. డ్యాన్స్ను బాగా ఇష్టపడుతాను. గెలిచిన తర్వాత ఆనందంలో వచ్చే డ్యాన్స్ మస్తు కిక్కు ఇస్తుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ఇదే జోరు కొనసాగిస్తూ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పతకం సాధించడం ధ్యేయంగా పెట్టుకుంటాం. ప్రత్యర్థుల కంటే ఫిట్నెస్ మాకు ప్రధాన ప్రత్యర్థి. దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఎక్కువగా గాయపడుతుంటాం. మేజర్ టోర్నీలకు ముందు ఫిట్నెస్తో ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఈ విషయంలో ఫిజియో ట్రైనర్స్ చాలా కష్టపడుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గోపీఅన్న పక్కకు ఉండటం మాకు బాగా కలిసొచ్చింది’ అని అన్నాడు. మరోవైపు ప్రణయ్ స్పందిస్తూ ఓవైపు గాయం బాధపెడుతున్నా..టీమ్ఈవెంట్తో పాటు వ్యక్తిగత విభాగంలో పతకం సాధించడం మరిచిపోలేని సందర్భమన్నాడు.