Srinidhi FC | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో వరుస విజయాలతో దూసుకెళుతున్న శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ)కు చుక్కెదురైంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న శ్రీనిధికి రియల్ కశ్మీర్ చెక్ పెట్టింది. సోమవారం దక్కన్ ఎరీనాలో జరిగిన మ్యాచ్లో శ్రీనిధి 2-3 తేడాతో రియల్ కశ్మీర్ చేతిలో ఓటమిపాలైంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ప్రథమార్ధం ఎలాంటి గోల్ నమోదు కాలేదు. అయితే కీలకమైన ద్వితీయార్ధంలో తొలుత శ్రీనిధి ఆధిక్యం ప్రదర్శించగా, రియల్ కశ్మీర్ దీటైన పోటీనిచ్చింది.
ఈ క్రమంలో రియల్ కశ్మీర్ తరఫున కిర్జో(45ని, 93ని) రెండు గోల్స్తో అదరగొట్టగా, తారిఖ్ మిర్(87ని) మరో గోల్ చేశాడు. మరోవైపు శ్రీనిధికి హసన్(58ని), సబియా(61ని) ఒక్కో గోల్ చేశారు. సాజిద్ ధోత్ రెండు సార్లు నిబంధనలు ఉల్లంఘించడంతో మ్యాచ్ రిఫరీ రెడ్కార్డ్కు గురయ్యాడు. ఈ కారణంగా శ్రీనిధి పది మంది ప్లేయర్లతోనే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. పాయింట్ల(33) పరంగా రెండు జట్లు సమంగా ఉన్నప్పటికీ ముఖాముఖి పోరులో విజయంతో రియల్ కశ్మీర్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, శ్రీనిధి మూడో స్థానంలో ఉంది. మొహమ్మదీన్(38) క్లబ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.