Asia cup 2023 : ఈ ఏడాది ఆసియా కప్ వేదికపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు కారణం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ప్రతిపాదించిన తటస్థ వేదికకు బీసీసీఐ(BCCI) ఆమోదం తెలపలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్(IPL 2023 Final) తర్వాతే టోర్నీ వేదికపై నిర్ణయం తీసుకుంటామని సెక్రటరీ జై షా(Jai Shah) ఇప్పటికే వెల్లడించాడు. అయితే.. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డ్(SLC) ఈ మెగా టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అవకాశం ఇస్తే తమ దేశంలో ఆసియా కప్ నిర్వహిస్తామని తెలిపింది.
‘ఆసియా కప్ నిర్వహించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉంది. అయితే.. ఇక నిర్ణం తీసుకోవాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ACC) మాత్రమే’ అని ఎస్ఎల్సీ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఏసీసీ సమావేశం ఉందనగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ప్రస్తావన తీసుకురావడం విశేషం. ఆసియా కప్లో ఆరుజట్లు(భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, నేపాల్) పాల్గొంటాయి. గత సీజన్లో సొంత గడ్డపై దసున్ శనక సారథ్యంలోని శ్రీలంక జట్టు ఆసియ కప్ను ఎగరేసుకుపోయింది.
ఆసియా కప్ 2022 ట్రోఫీతో శ్రీలంక జట్టు
షెడ్యూల్ ప్రకారం అయితే.. ఈసారి ఆసియా కప్ పాకిస్థాన్లో జరగాలి. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి టీమిండియాను పంపబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దాంతో, పీసీబీ అధ్యక్షుడు నజం సేథీతో సహా పాక్ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భారత జట్టు తమదేశంలో ఆసియా కప్ ఆడకుంటే తమ జట్టు వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు రాదని ప్రకటించారు. అక్కడితో మొదలు వేదిక గురించి వివాదం నడుస్తూనే ఉంది. అయితే.. గత సీజన్కు ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంకలోనే ఈసారి టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ నేటితో ముగియనుంది. ఆవిషయమై తర్వాత ఆసియా కప్ను ఎక్కడ జరపాలి అనే విషయమై బీసీసీఐ, ఏసీసీలో చర్చించనుంది.
జై షా, నజం సేథీ
ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే, సీఈఓ జియోఫ్ అల్లర్డిసె రేపు, ఎల్లుండి పాకిస్థాన్లో పర్యటించనున్నారు. వాళ్లిద్దరూ పీసీబీ చీఫ్ నజం సేథీతో ఆసియా కప్ గురించి చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు వరల్డ్ కప్లో అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ పై నజం సేథీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ జట్టు భద్రత కారణాల వల్ల అహ్మదాబాద్లో మ్యాచ్ ఆడబోదని అతను ఇప్పటికే చెప్పాడు. దాంతో, ఆ విషయం గురించి కూడా ఐసీసీ పెద్దలు అతడితో మాట్లాడనున్నారు.