Timed Out Celebration | ప్రపంచ క్రికెట్లో దాయాదుల (భారత్-పాకిస్తాన్) మధ్య జరిగే మ్యాచ్ల స్థాయిలో కాకున్నా గత నాలుగైదేండ్లుగా మరో రెండు ఆసియన్ క్రికెట్ టీమ్స్ అయిన శ్రీలంక – బంగ్లాదేశ్లు ఇదే వైరాన్ని పెంచుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యలు, అన్నాతమ్ముళ్ల పంచాయితీ ఏంలేకున్నా ఇరు జట్ల ఆటగాళ్లు పదే పదే కవ్వించుకుంటూ వాళ్ల శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న శ్రీలంక ఆటగాళ్లు.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను గెలుచుకున్న తర్వాత బంగ్లా క్రికెట్ టీమ్ను దారుణంగా ట్రోల్ చేశారు. ‘టైమ్డ్ ఔట్’ సెలబ్రేషన్స్తో బంగ్లా ఆటగాళ్లను ఆటాడుకున్నారు. వన్డే వరల్డ్ కప్లో భాగంగా లంక – బంగ్లా మధ్య జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ విధానంలో మొట్టమొదటిసారిగా ఔట్ అయిన క్రికెటర్గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇరు జట్ల మధ్య శనివారం ముగిసిన మూడో టీ20లో లంక 28 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-1తో చేజిక్కించుకుంది. మ్యాచ్ ముగిసి ట్రోఫీని పట్టుకుని ఫోటోలకు ఫోజిచ్చే వేళ లంక క్రికెటర్లంతా చేతికి వాచీ పెట్టుకునే దగ్గర వేళ్లు పెట్టి ‘టైమ్డ్ ఔట్’ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇది బంగ్లా ఆటగాళ్లను ట్రోల్ చేయడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.
Time out celebration 😂 pic.twitter.com/ijFTqhDu1Z
— SRI LANKA CRICKET LIONS (@slcricketlions) March 9, 2024
ఇదే సిరీస్లో బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ పేసర్ షోరిఫుల్ ఇస్లాం.. లంక బ్యాటర్ అవిష్కా ఫెర్నాండోను ఔట్ చేయగానే అత్యుత్సాహంతో ఈ టైమ్డ్ ఔట్ విధానంలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే విధంగా లంకేయులు రిపీట్ చేయడం గమనార్హం.
Time badal gaya, par ‘Timeout’ celebration nahin badla 😂
.
.#BANvsSL #FanCode pic.twitter.com/xdopmoasL9— FanCode (@FanCode) March 4, 2024
గతేడాది వన్డే వరల్డ్ కప్లో భాగంగా లంక మిడిలార్డర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్.. బ్యాటర్ ఔట్ అయ్యాక నిర్ణీత సమయంలో వచ్చి క్రీజులో బ్యాట్ పట్టకపోవడంతో బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ ‘టైమ్డ్ ఔట్’కు అప్పీల్ చేయగా అంపైర్.. మాథ్యూస్ను ఔట్గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే మ్యాచ్లో షకిబ్ ఔట్ అయ్యాక మాథ్యూస్.. ‘టైమ్ అయిపోయింది.. వెళ్లు’ అని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లంకేయులు టీమ్గా బంగ్లా ఆటగాళ్లను ఆటాడుకున్నారు.