IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) సేవల్ని కోల్పోయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా హసరంగ మెగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో నిఖార్సైన స్పిన్నర్ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకని అతడి స్థానంలో ఆరెంజ్ ఆర్మీ శ్రీలంకకే చెందిన యువ స్పిన్నర్ను తీసుకుంది. లెగ్ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్(Vijayakanth Viyaskanth)తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
మంళవారం హైదరాబాద్ ఫ్రాంచైజీ విజయకాంత్కు స్వాగతం పలుకుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ‘వనిందు హసరంగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి అందుబాటులో లేడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. హసరంగ స్థానంలో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్ జట్టుతో కలిశాడు. వియస్కాంత్ నీకు స్వాగతం’ అని ఎస్ఆర్హెచ్ పోస్ట్లో రాసుకొచ్చింది.
🚨 ANNOUNCEMENT 🚨
Wanindu Hasaranga will be unavailable for the season due to injury. We would like to wish him a speedy recovery.
Sri Lankan spinner Vijayakanth Viyaskanth has joined the squad as his replacement for the rest of #IPL2024. Welcome, Viyaskanth! ✨ pic.twitter.com/A2Z5458dH8
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2024
వియస్కాంత్ లంక తరఫున ఇప్పటివరకూ ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే.. ఇతర లీగ్స్తో కలిపి 33 టీ20లు ఆడిన ఈ యువ స్పిన్నర్ 18.78 సగటుతో 42 వికెట్లు తీశాడు. పొట్టి ఫార్మాట్లో పెద్దగా అనుభవం లేకపోయినా అతడికి హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.50 లక్షలు చెల్లించనుంది. దాంతో అతడు కమిన్స్ సేనకు బలమవుతాడా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 16వ సీజన్లో విజృంభించిన మయాంక్ మార్కండే.. ఈ సీజన్లో విఫలమవుతున్నాడు. దాంతో, పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో వియస్కాంత్కు చోటు దక్కే చాన్స్ లేకపోలేదు.
తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది రోజున ముల్లన్పూర్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే పంజాబ్ చేరుకున్న కమిన్స్ సేన మ్యాచ్ కోసం నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చుతోంది. పదిహేడో సీజన్లో రికార్డులు తిరగరాస్తున్న ఆరెంజ్ ఆర్మీ.. ముంబై ఇండియన్స్పై ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్కోర్(277 పరుగులు) కొట్టింది. ఆ తర్వాత గుజరాత్ చేతిలో కంగుతిన్నా.. అనూహ్యంగా పుంజుకొని డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తుగా ఓడించింది. రెండు విజయాలతో ప్రస్తుతం కమిన్స్ సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.