బ్యాడ్మింటన్ సింగిల్స్లో తప్ప.. డబుల్స్లో చెప్పుకోదగ్గ స్థాయి ఆటగాళ్లు లేని దశలో.. నేనున్నానంటూ దూసుకొచ్చిన.. ఆ కుర్రాడు చూస్తుండగానే స్టార్ షట్లర్గా ఎదిగాడు. డబుల్స్లో ప్రాతినిధ్యం తప్ప.. పతకాలు సాధించడం కల్లే అనుకుంటున్న సమయంలో వరుస విజయాలతో విజృంభించాడు. మూడేండ్ల క్రితం థాయ్లాండ్ ఓపెన్ నెగ్గడం ద్వారా ప్రపంచానికి తన ఆగమనాన్ని ఘనంగా చాటిన ఆ తెలుగు కుర్రాడు.. ఈ ఏడాది డబుల్ ధమాకా మోగించాడు. భారత బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ దక్కించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ఇటీవల బర్మింగ్హామ్ కామన్వెల్త్లో పసిడి పతకంతో మెరిశాడు. ఇక్కడితో ఆగిపోయేది లేదని.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యమంటున్న రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
2 కామన్వెల్త్లో స్వర్ణం నెగ్గడంపై మీ స్పందన?
బర్మింగ్హామ్ బయల్దేరడానికి ముందు స్వర్ణంతోనే తిరిగి రావాలని బలంగా అనుకున్నాం. అందుకు తగ్గట్లే ఫేవరెట్గా బరిలోకి దిగి.. అంచనాలకు తగ్గట్లు ముందుకు సాగాం. గోల్డ్కోస్ట్ (2018) కామన్వెల్త్ క్రీడల్లో తృటిలో స్వర్ణం చేజారడంతో ఈసారి అలాంటి తప్పులు చేయొద్దని అనుకున్నాం. అందుకు తోడు టీమ్ ఈవెంట్ ఫైనల్లో మన జట్టు ఓటమి పాలవడం కలచి వేసింది. కచ్చితంగా పసిడి దక్కుతుందనుకుంటే.. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ బాధలో మరింత కసిగా ఆడాం.
2 గోల్డ్కోస్ట్ క్రీడలకు బర్మింగ్హామ్కు మధ్య మన షట్లర్ల పురోగతి ఎలా ఉంది?
నాలుగేండ్ల క్రితంతో పోల్చుకుంటే ఈ సారి స్వర్ణాలు ఎక్కువ వచ్చాయి. కొన్నిసార్లు పరాజయాలు కూడా మంచే చేస్తాయి. టీమ్ ఈవెంట్ ఫైనల్ ఫలితం మాలో పట్టుదల పెంచింది. అదీకాక పోటీల చివరి రోజు సింగిల్స్లో పీవీ సింధు, లక్ష్యసేన్ పసిడి పతకాలు చేజిక్కించుకోవడం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అప్పటికే రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరడంతో మూడో పసిడి హారం మెడలో వేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో పోరాడాం.
2 చిరాగ్ శెట్టితో జోడీ ఎలా కుదిరింది?
ఇప్పుడంటే ఇద్దరం కలిసి కోర్టులో చెలరేగిపోతున్నాం కానీ.. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిరాగ్ మహారాష్ట్రకు చెందినవాడు కాగా.. మాది ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం. ఆరంభంలో నాకు హిందీ, ఇంగ్లిష్ పెద్దగా వచ్చేవి కావు. దీంతో ఏదైనా చెప్పాలనుకున్నా భయపడే వాడిని. కానీ రానురాను మా మధ్య అనుబంధం పెరిగింది. మైదానం బయట కూడా మేం మంచి స్నేహితులుగా మారడంతో ఒకరినొకరం అర్థం చేసుకోగలిగాం. ఒకరి ఆటపై మరొకరికి పూర్తి నమ్మకం కుదిరినప్పుడే డబుల్స్లో విజయాలు సాధించగలం. ఈ విషయంలో నేను, చిరాగ్ ఒకే విధంగా ఆలోచిస్తాం.
2 ఫిట్నెస్ ఎలా కాపాడుకుంటారు?
ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీలు నెగ్గడం కన్నా.. ఫిట్నెస్ కాపాడుకోవడమే ప్రధానం. స్వతహాగా నేను, చిరాగ్ అటాకింగ్ ఆటగాళ్లమే కావడంతో ఎప్పుడూ గాయాల బెడద పొంచి ఉంటుంది. అందుకే గాయాల కారణంగా ప్రధాన టోర్నీలకు దూరం కాకుండా ఉండేందుకు షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తుంటాం. ఫిట్నెస్ మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టాం.
2 తదుపరి లక్ష్యాలేంటి?
వచ్చే వారం నుంచి టోక్యో వేదికగా జరుగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గురించే ఆలోచిస్తున్నాం. కామన్వెల్త్ గేమ్స్ విజయం అనంతరం ప్రాక్టీస్కు ఎక్కువ సమయం దొరకలేదు. దేశంలో ఘన స్వాగతం, ప్రధానమంత్రి ఆతిథ్యంతో పూర్తిస్థాయి శిక్షణ సాగలేదు. అయితే ఇది ముందే ఊహించాం కాబట్టి అందుకు తగ్గట్లు.. ఎప్పటి నుంచో ఈ మెగా
టోర్నీని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా వుంది?
ఒక ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మా కుటుంబంలో నాకోసం అన్నయ్య రామ్ చరణ్ ఎంతో చేశాడు. నా కెరీర్ కోసం తన చదువు, ఉద్యోగాన్ని పక్కనపెట్టి నా వెన్నంటి నిలిచి ప్రోత్సహించాడు. కామన్వెల్త్ క్రీడల సమయంలో అన్నా, వదిన ప్రత్యక్షంగా మ్యాచ్లు చూశారు. వారి సమక్షంలో విజేతగా నిలిచి.. పోడియంపై జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు కళ్లలో నుంచి నీళ్లు ఆగలేదు. నేను, అన్నయ్య కన్నీటి పర్యంతమయ్యాం. అతడి ప్రోత్సాహం లేకుంటే నేను ఈ స్థాయికి చేరుకోలేకపోయేవాడిని.
దేశంలో డబుల్స్కు క్రేజ్ తెచ్చిన జోడీగా మీ ఫీలింగ్?
గర్వంగా ఉంది. ఇక్కడితో ఆగిపోవాలనుకోవడం లేదు. సింగిల్స్లో ఎలా మన ప్రయాణం సాగిందో.. డబుల్స్లో కూడా నిలకడగా విజయాలు సాధించాలి. గతంలో సింగిల్స్ ఆడి పెద్దగా ప్రభావం చూపలేని ఆటగాళ్లు.. డబుల్స్ వైపు వచ్చేవాళ్లు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. డబుల్స్నే కెరీర్గా ఎంచుకునే వారి సంఖ్య పెరిగింది. డబుల్స్లో దేశం తరఫున గతంలో మెరుగైన ప్రదర్శనలు చెప్పుకోదగ్గ స్థాయిలో నమోదు కాలేదు. ఇప్పుడు మేం వరుస విజయాలు సాధిస్తుండటం ఆనందంగా ఉంది. యువ ఆటగాళ్లు డబుల్స్ వైపు అడుగులు వేస్తుండటంతో ప్రాధాన్యం పెరగడంతో పాటు స్పాన్సర్లు కూడా పెరిగారు. ప్రభుత్వం నుంచి కూడా చక్కటి సహకారం లభిస్తున్నది. నేను 15 ఏండ్ల వయసులోనే డబుల్స్ ఆడాలని నిర్ణయించుకున్నా. గోపీచంద్ సార్ కూడా అదే కొనసాగించమని చెప్పారు.