దేశంలో వారసత్వం వర్ధిల్లుతున్నది. ఇన్నాళ్లు ఇది రాజకీయాలకే పరిమితమైందనుకున్నాం. కానీ క్రీడల్లోనూ ఈ పోకడ కొనసాగుతున్నది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐలో వారసుల హవా దిగ్విజయంగా నడుస్తున్నది. ఏండ్లకు ఏండ్లు కుటుంబ పెత్తనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దేశంలో కొన్ని రాష్ర్టాల క్రికెట్ సంఘాలు వారికి పెట్టని కోటగా మారిపోయాయి. అసోసియేషన్లను తమ వారసత్వ అడ్డాగా మార్చుకుంటూ కోట్లకు పడగలెత్తుతూ పరపతి సాగిస్తున్నారు. ఇది ఎంతలా అంటే దేశంలో ఎక్కువలో ఎక్కువ క్రికెట్ సంఘాలు వారి కనుసన్నల్లో నడుస్తున్నాయి అంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీదే అగ్రభాగమని చెప్పొచ్చు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనయుడు మహాఆర్యమన్ సింధియా ఇటీవలే గ్వాలియర్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పగ్గాలు అందుకోగా, రాజకీయ నాయకుల పుత్రరత్నాలు, మాజీ అధికారుల బంధువులు క్రికెట్ సంఘాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ను శాసిస్తున్న వారసత్వ రాజకీయాలపై ప్రత్యేక కథనం..
సరిగ్గా 94 ఏండ్ల క్రితం 1928లో తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పురుడుపోసుకుంది. స్వయం పాలిత సంస్థగా ఏర్పడ్డ బీసీసీఐ దినదినాభివృద్ధితో ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 35 మంది అధ్యక్ష పదవిని అధిరోహించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది..కానీ ఇన్నేండ్ల సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో వారసత్వ పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. కాసుల వర్షం కురిపించే బీసీసీఐపై కొంత మంది రాజకీయ నాయకులు కన్నేస్తే… అధికారులు వారికి వంత పాడారు. ఈ క్రమంలో లెక్కకు మిక్కిలి డబ్బును ఆర్జించారు. పదవికి పదవి… డబ్బుకు డబ్బు.. హోదాకు హోదా. ఇలా అప్రతిహతంగా తమకు తిరుగులేదన్నట్లు రాజకీయ నాయకులు, అధికారుల బంధువులు బీసీసీఐని అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా హవా కొనసాగిస్తుండగా.. తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహాఆర్యమన్ సింధియా.. గ్వాలియర్ క్రికెట్ పగ్గాలు అందుకోవడంతో మరోమారు వారసత్వ అంశం తెరమీదికి వచ్చింది.
ఇదిలా ఉంటే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ 2016లో పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ‘దేశంలోని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు కొన్ని కుటుంబాలు, కొంత మంది వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. క్రికెట్ను కొందరికే పరిమితం కావడాన్ని నియంత్రించాలనుకుంటున్నాం’ అని లోధా కమిటీ సిఫారసు చేసింది. ఇందులో భాగంగా 70 ఏండ్లకు మించిన వాళ్లు పదవిలో కొనసాగేందుకు వీలులేకపోవడం, ఆరేండ్ల పదవీకాలం తర్వాత మూడేండ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ లాంటి నిబంధనలు తీసుకొచ్చింది. అయినా..పేపర్ మీద ఇవి కఠినంగా కనిపిస్తున్నా.. ఎన్నికల విషయానికి వచ్చే సరికి తమ పరపతితో పదవులు సొంతం చేసుకుంటున్నారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వాపోయారు. ‘ఏండ్ల కొద్ది ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న పెద్దలు పాతుకుపోయారు. జిల్లాలు, క్లబ్లు అందులోని సభ్యులపై పూర్తి పట్టు సాధించారు. చాలా రాష్ట్ర సంఘాలు ఇప్పటికీ ప్రైవేట్ క్లబ్ల వలే నడుస్తున్నాయి. ఈ కారణంగా వేరే వ్యక్తులు సంఘాల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా పోయింది’ అని బోర్డు వ్యవహారాలను దగ్గర్నుంచి చూసే ఒకరు పేర్కొన్నారు.
ఏండ్లుగా ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఎలా ఏలుతున్నారో కొన్ని ఉదాహరణలు మన కండ్లు ముందు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్ గెహ్లాట్ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. దీనికి తోడు ఈ మధ్యే తన తనయుడు మహాఆర్యమన్ను గ్వాలిఫయర్ క్రికెట్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా నియమించాడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఇలా చెప్పుకుంటే పోతే ఇదో ఒడువని ముచ్చట. ఇదే విషయమై సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి నిరంజన్ షాను సంప్రదిస్తే..‘ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరు ఆపుతున్నారు? ఆట అంటే ఇష్టముండి.. కార్యనిర్వహకుడిగా నెగ్గుకురాగలను అనుకుంటే ఎవరైనా పోటీచేయవచ్చు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల వల్ల నేను రిటైర్ అయ్యాను. ఏండ్లుగా నిర్మితమైనా ఒక వ్యవస్థ తప్పుడు వ్యక్తుల్లో వెళ్లడానికి వీలులేదు. నా కొడుకు ఫస్ట్క్లాస్ క్రికెటర్, అతనికంటూ ఒక గుర్తింపు ఉంది. క్రికెట్ను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాడు’ అని షా చెప్పుకొచ్చాడు.