బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా గంగూలీ తన పదవిలో కొనసాగడం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టీమిండియా మాజీ సారధి కన్ను ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవిపై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్న గ్రెగ్ బార్క్లీ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది.
ఇటీవల బర్మింగ్హామ్లో జరిగిన వార్షిక సమావేశంలో మాట్లాడిన బార్క్లీ.. ఈ పదవిలో మరో రెండేళ్లు కొనసాగాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అదే సమయంలో ఐసీసీ చైర్మన్ ఎన్నిక విధానంలో కూడా ఈ సమావేశంలో మార్పులు చేశారు. మొత్తం 16 మంది డైరెక్టర్లలో 51 శాతం అంటే 9 మంది ఓట్లు ఏ అభ్యర్థికి పడితే వాళ్లే ఐసీసీ చైర్మన్ అవుతారు.
ఇప్పుడు గంగూలీని ఐసీసీ చైర్మన్ చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే 9 ఓట్లు సంపాదించడం గంగూలీకి అంత కష్టమేమీ కాదు. గంగూలీ గనుక ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే.. బీసీసీఐ పగ్గాలను జైషా అందుకుంటారు. ప్రస్తుతం ట్రెజరర్ అరుణ్ ధుమాల్ను సెక్రటరీగా నియమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గంగూలీ అనుకున్నది జరిగితే భారత్ నుంచి ఐసీసీ అత్యున్నత పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా ఈ మాజీ భారత కెప్టెన్ రికార్డు సృష్టిస్తాడు. గతంలో ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఈ పదవిని చేపట్టారు. అంతకుముందు ఐసీసీ ప్రెసిడెంట్ పదవిలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్ పనిచేశారు.