కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికీ అడ్మినిస్ట్రేటర్గా ఉండడం తనకు ఇష్టం లేదన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని ఉన్నా.. గంగూలీని తప్పిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ పదవి కోసం రోజర్ బిన్నీ దాదాపు ఖరారైనట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంధన్ బ్యాంక్ ఈవెంట్లో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ.. చాన్నాళ్ల నుంచి పరిపాలకుడి పాత్రను పోషించానని, ఇప్పుడు మరో పాత్రను పోషించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
చాన్నాళ్లుగా అడ్మినిస్ట్రేటర్గా ఉన్నానని, ఇప్పుడు మరో ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆశిస్తున్నట్లు గంగూలీ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఏది చేసినా, ఉత్తమ రోజులు మాత్రం ఇండియాకు ఆడడమే అని అన్నారు. బీసీసీఐకి ప్రెసిడెంట్గా చేశానని, ఇక ముందు మరిన్ని గొప్ప పనులు చేయనున్నట్లు చెప్పారు. ఎప్పటికీ ప్లేయర్గా ఉండలేమని, అలాగే ఎప్పటికీ పరిపాలకుడిగా ఉండలేమని, ఆ రెండూ చేయడం సంతోషంగా ఉందని గంగూలీ అన్నారు. ఒక్క రోజులో అంబానీనో మోదీనో కాలేమన్నారు. అలా కావడానికి నెలలు, సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుందన్నారు.