Sourav Ganguly : క్రికెటింగ్ లీగ్స్ భవితవ్యంపై బీసీసీఐ మజీ బాస్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నాలుగైదు ఏళ్లలో కొన్ని క్రికెటింగ్ లీగ్స్ మాత్రమే ఉంటాయని అతను అన్నాడు. ‘ఈ లీగ్స్ అన్ని కూడా క్రికెట్ పాపులర్ అయిన దేశాలకు చెందినవి. అయితే.. రానున్న నాలుగు లేదా ఐదేళ్లలో వీటిలో కొన్ని లీగ్స్ కనుమరుగవుతాయి. ఎందుకంటే.. క్రికెటింగ్ లీగ్స్ అంత ముఖ్యం కాదనే విషయాన్ని ఆటగాళ్లు త్వరలోనే తెలుసుకుంటారు. దేశానికి ఆడడంతో పాటు లీగ్స్కు ఆడడం కూడా ముఖ్యమనే విషయాన్నివాళ్లు గుర్తిస్తారు’ అని గంగూలీ అన్నాడు.
క్రికెటింగ్ లీగ్స్లో ఐపీఎల్ భిన్నమై నదని, భిన్నమైన వాతావరణంలో ఈ టోర్నీని నిర్వహిస్తారని అతను తెలిపాడు. అంతేకాదు.. ‘ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్న బిగ్బాష్ లీగ్ కూడా అద్భుతంగా ఉంటోంది. ఈమధ్యే మొదలైన దక్షిణాఫ్రికా లీగ్ కూడా ఆసక్తిగా ఉంది. గత మూడు వారాలుగా ఆ టోర్నీని గమనిస్తున్నా’ అని గంగూలీ వెల్లడించాడు.
పోటీకి కారణం అదే..
కొత్తగా వచ్చిన లీగ్స్లో ఆడేందుకు చాలామంది క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకనే లీగ్స్ వేలంలో పోటీ కనిపిస్తోంది అని గంగూలీ చెప్పాడు. ఇప్పటివరకైతే.. ప్రతి ఒక్కరు ఏదో ఒక లీగ్లో ఆడాలని ఆరాటపడుతున్నారు. అందుకనే లీగ్స్ వేలంలో అంత పోటీ కనిపిస్తోంది. అయితే.. ఈ లీగ్స్లో చాలావరకు వచ్చే ఐదేళ్లలో కనుమరుగవుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకునే లీగ్స్ మాత్రమే కొనసాగుతాయి అని గంగూలీ తెలిపాడు. అంతేకాదు క్రికెట్ను పోత్సహించే వ్యవస్థ ఉండడం చాలా ముఖ్యమని అతను అభిప్రాయపడ్డాడు. ‘బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్కు నాలుగేళ్లు అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్గా మూడేళ్లు కొనసాగాను. భారత్ తరఫున ఐసీసీకి ప్రాతినిధ్యం వహించాను. క్రికెట్ వ్యవస్థ గురించి తెలుసుకున్నా’ అని ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు.