కోల్కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).. ఇవాళ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేస్బుక్ పేజీని ఆపరేట్ చేసి.. తన ప్రతిష్టను దిగజార్చుతున్నట్లు ఆయన ఆరోపించారు. సౌరవ గంగూలీ ఫ్యాన్స్ అన్న సోషల్ మీడియా పేజీలో తనకు సంబంధం లేకుండానే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్స్వికీ అనే మరో సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై కూడా సౌరవ్ గంగూలీ ఫిర్యాదు చేశారు. థాకుర్పుకుర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తన ప్రతిష్టను కళంకం చేసే రీతిలో ఫేస్బుక్ పేజీలో నిరంతరం పోస్టులు చేస్తున్నారని, ప్రజల్లో తన పట్ల నెగటివ్ భావన వచ్చేలా ప్రవర్తిస్తున్నారని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను పబ్లిక్ ఫిగర్ కావడం వల్ల సమస్య మరింత పెరుగుతోందని, కానీ తప్పుడు విషయాలను వ్యాప్తి చేస్తున్నారని, అభ్యంతరకర, డ్యామేజింగ్ కంటెంట్ను ప్రచారం చేస్తున్నారని, తన గౌరవాన్ని భంగపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో కఠినన న్యాయపరమైన చర్య తీసుకోవాలని గంగూలీ తన ఫిర్యాదులో కోరారు. సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ పేరుతో ఫేస్బుక్ పేజీని ఆపరేట్ చేస్తున్నవారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.