అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్ అసోసియేషన్ (NBA)లో చోటు కోసం అక్కడి ఆటగాళ్లు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఇండియాలో ఐపీఎల్ మాదిరిగా వేల కోట్ల విలువ ఉండే ఈ లీగ్ లో పురుషాధిపత్యం ఎక్కువే. ఈ లీగ్ లో చోటు దక్కడమే కష్టమనుకుంటే ఒక మహిళ ఏకంగా కోచ్ గా నియమితురాలైంది. మహిళ కోచ్ అయితే ఏమంట గొప్ప..? అని అనుకుంటున్నారా..? అవును, మనకు గొప్పే.. సదరు కోచ్ మన మాణిక్యమే. ఆమె ప్రవాస భారతీయురాలు. అరుదైన ఘనత సాధించిన ఆమె పేరు సోనియా రామన్.
యూఎస్ లోని బోస్టన్ కు చెందిన రామన్.. NBA లోని Memphis Grizzlies జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా నియమితురాలైంది. ఎన్బీఏ లో మహిళా కోచ్ అయిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా ఆమె చరిత్రలో తన పేరును లిఖించుకుంది. రామన్ కంటే ముందు విన్ బావ్నని (Sacramento Kings), రాయ్ రానా (Sacramento Kings) కోచ్ లుగా పని చేస్తున్నారు. అయితే మహిళగా ఈ లీగ్ లో రామన్ దే తొలి అడుగు. మొత్తంగా ఎన్బీఏ చరిత్రలో రామన్ 14వ మహిళా కోచ్.
రామన్ తండ్రిది చెన్నై కాగా తల్లిది మహారాష్ట్రలోని నాగ్పూర్. ఈ ఇద్దరూ చాలా కాలం క్రితమే యూఎస్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆర్ట్స్ లో డిగ్రీ చేసి న్యాయవాది పట్టా పొందిన రామన్.. తనకు ఇష్టమైన బాస్కెట్ బాల్ కోసం న్యాయవాద వృత్తిని పక్కనబెట్టింది.
ఎన్బీఏలోకి రాకముందు రామన్.. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) మహిళా బాస్కెట్ బాల్ జట్టుకు కోచ్ గా పనిచేసేది. మిట్స్ కు ఘన విజయాలు అందించడంతో ఎన్బీఏ కన్ను రామన్ మీద పడింది. దీంతో ఆమెను టేలర్ జెన్కిన్స్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న మెంఫిస్ గ్రిజ్లిస్ కు అసిస్టెంట్ కోచ్ గా నియమించింది ఆ జట్టు యాజమాన్యం. కాగా ఎన్బీఏ లో భాగం కావడంపై సోనియా హర్షం వ్యక్తం చేసింది.
JUST ANNOUNCED: We’ve hired Sonia Raman as an assistant coach.
Details ⬇️https://t.co/fj3nSBHlUu
— Memphis Grizzlies (@memgrizz) September 11, 2020