న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత యువ ఓపెనర్ స్మృతి మందనకు భారత మహిళల క్రికెట్ జట్టు పగ్గాలు అప్పగించడం మంచిదని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాదీ స్టార్ మిథాలీరాజ్ ప్రస్తుతం భారత వన్డే కెప్టెన్గా కొనసాగుతుండగా.. మెగాటోర్నీ అనంతరం ఆమె ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం రామన్ మాట్లాడుతూ.. ‘జట్టు పగ్గాలు అందుకునేందుకు స్మృతి సిద్ధంగా ఉంది. గతంలో కోచ్గా పని చేసినప్పుడు ఆమెను దగ్గర నుంచి చూశా. ఆటపై మందనకు మంచి అవగాహన ఉంది. ఇది జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని అన్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన డే అండ్ నైట్ టెస్టులో సెంచరీతో చెలరేగిన మందన.. ప్రస్తుతం కంగారూలతో పొట్టి సిరీస్ కోసం సిద్ధమవుతున్నది.