అవని, హర్విందర్కు కాంస్యాలు
హైజంప్లో ప్రవీణ్కు రజతం
టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు విశ్వరూపం కనబరుస్తున్నారు. వరుసగా రెండు రోజులు ఒక్క పతకం సాధించని మనవాళ్లు.. శుక్రవారం ముచ్చటగా మూడు మెడల్స్ చేజిక్కించుకున్నారు. హైజంప్లో ప్రవీణ్ కుమార్ రజత కాంతులు విరజిమ్మితే.. విశ్వక్రీడల్లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్గా రికార్డు సృష్టించిన షూటర్ అవని మరో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఆర్చరీలో హర్విందర్ సింగ్ గురి కుదరడంతో భారత్కు మరో కాంస్యం దక్కింది. దీంతో భారత్ 13 పతకాలతో పట్టికలో 37వ స్థానానికి ఎగబాకింది.
టోక్యో: పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతున్నది. హైజంప్లో ప్రవీణ్ కుమార్ రజతం కైవసం చేసుకుంటే.. ఇప్పటికే షూటింగ్లో స్వర్ణంతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన అవని.. మరో కాంస్య పతకం చేజిక్కించుకుంది. ఆర్చరీలో హర్విందర్ సింగ్ కాంస్యం కైవసం చేసుకోవడంతో శుక్రవారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఆదివారంతో ముగియనున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 13 (2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) పతకాలు సాధించింది. టోక్యో విశ్వక్రీడలకు ముందు వరకు జరిగిన పారాలింపిక్స్ క్రీడలన్నింటిలో కలిపి భారత్ 12 పతకాలే నెగ్గగా.. తాజా క్రీడల్లోనే ఆ సంఖ్యను దాటడం గమనార్హం. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ (టీ64)లో 2.07 మీటర్ల ఎత్తు దూకిన 18 ఏండ్ల ప్రవీణ్ కుమార్ రజతం సాధించడంతో పాటు ఆసియా రికార్డును బద్దలు కొడుతూ.. భారత్ తరఫున విశ్వక్రీడల్లో పతకం నెగ్గిన అతి పిన్నవయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. మహిళల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రి పొజిషన్ ఎస్హెచ్1 ఈవెంట్లో 19 ఏండ్ల అవని 445.9 పాయింట్లతో కాంస్యం నెగ్గడం ద్వారా.. పారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్గా చరిత్రకెక్కింది. వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీలో హర్విందర్ సింగ్ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. పారాలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో భారత్కు ఇదే తొలి పతకం కావడం విశేషం.
సెమీస్లో ప్రమోద్ జోడీ
బ్యాడ్మింటన్లో ప్రమోద్ భగత్-పాలక్ కోహ్లీ జంట సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం క్వార్టర్స్లో ప్రమోద్-పాలక్ జోడీ 21-15, 21-19తో సిరిపొంగ్-నిపాడా (థాయ్లాండ్) ద్వయంపై విజయం సాధించింది. సింగిల్స్లో ఇప్పటికే ప్రమోద్ సెమీస్కు చేరగా.. సుహాస్ యతిరాజ్, తరుణ్ ఢిల్లాన్, మనోజ్ సర్కార్ కూడా సెమీస్లో అడుగుపెట్టారు. మరోవైపు స్విమ్మింగ్లో నిరంజన్ ముకుందన్, నారాయణ్ జాదవ్ పురుషుల 50మీ బట్టర్ఫ్లై విభాగంలో ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. షాట్పుట్ (ఎఫ్57)లో గుండును 13.81 మీటర్ల దూరం విసిరిన సోమన్ రాణా నాలుగో స్థానంలో నిలిచి కాంస్యం చేజార్చుకోగా.. మహిళల క్లబ్ త్రో లో కశిష్ లక్రా, ఏక్తా భ్యాన్ నిరాశపరిచారు.
నా ప్రదర్శనతో సంతృప్తిగా లేను. చివరి షాట్ సరిగ్గా గురిపెట్టి ఉంటే స్వర్ణం దక్కేది. విశ్వక్రీడల్లో రెండో పతకం సాధించడం ఆనందంగా ఉన్నా.. సంబురాలను పక్కనపెట్టి తదుపరి పోటీపై దృష్టి పెట్టా. ఆదివారం జరుగనున్న మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో స్వర్ణం సాధించేందుకు శాయశక్తులా కృషిచేస్తా. అభినవ్ బింద్రా సార్ జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందా. ఆయన దారిలోనే నడుస్తూ దేశం గర్వించే స్థాయికి చేరడమే నా లక్ష్యం.