Shardul Thakur : టీమిండియా ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఎంట్రప్రెన్యూర్ అయిన మితాలీ పారుల్కర్ను అతను ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నాడు. వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు ఫిబ్రవరి 25వ తేదీన మొదలు అవుతాయి. ఈ విషయాన్ని కాబోయే పెళ్లి కూతురు మితాలీ వెల్లడించింది. ‘శార్ధూల్ క్రికెట్ షెడ్యూల్తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 24 వరకు అతనికి మ్యాచ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 25న మాతో కలుస్తాడు. మా పెళ్లికి దాదాపు 200 నుంచి 250 మంది అతిథులు వస్తారని అనుకుంటున్నాం’ అని మితాలీ తెలిపింది. గత ఏడాది నవంబర్లో శార్ధూల్, మిట్టాలి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
మేము మొదటగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నాం. అయితే, బంధువులు, స్నేహితులు ఎక్కువ మంది ఉండడంతో అందరినీ గోవా తీసుకెళ్లడం కష్టమని ఆ నిర్ణయం వాయిదా వేశాం అని మితాలీ వెల్లడించింది. ముంబైకి సమీపంలోని కర్జత్ ప్రాంతంలో శార్ధూల్, మితానీల వివాహం జరగనుంది. మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. పెళ్లి రోజు నవారీ చీర కట్టుకుంటానని, తమ పెళ్లి కేకును తానే తయారు చేస్తానని మితాలీ తెలిపింది.
ఈ ఏడాది ఐపీఎల్లో శార్దూల్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతడిని కోల్కతా కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో రూ. 10.75 కోట్లకు శార్ధూల్ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ట్రేడింగ్ పద్ధతిలో కోల్కతాకు అమ్మేసింది.