Mohammed Shami’s Wife: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్జహాన్ మరోసారి భారత క్రికెట్ జట్టుపై నోరు పారేసుకుంది. అసలే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయి బాధలో ఉన్న అభిమానులకు పుండుమీద కారం చల్లినట్టుగా ఆమె వ్యాఖ్యలున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం మాత్రం మంచి మనసున్నోళ్లదేనని పోస్ట్ పెట్టి ఆమె వార్తల్లో నిలిచింది. భారత్ – ఆసీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో .. షమీతో పాటు టీమిండియాను ఉద్దేశించే ఆమె ఇలా చేసిందని అభిమానులు మండిపడుతున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత హసీన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆమె నిస్తేజంగా కెమెరా వైపునకు చూస్తుండగా బ్యాక్గ్రౌండ్లో ‘చివరికి విజయం వరించేది మంచి మనసున్నోళ్లకే’ అని ఆడియో వినిపించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆమె ‘అల్లాహు అక్బర్’ అని రాసుకొచ్చింది. ఇది తన మాజీ భర్త షమీని ఉద్దేశించి షేర్ చేసిందేనని అభిమానులు వాపోతున్నారు. ఒక వ్యక్తి మీద కోపాన్ని దేశం మీద ద్వేషంగా మార్చడం కరెక్ట్ కాదని, ఆమె చెప్పినదాని ప్రకారం టీమిండియాలో మంచి మనసున్నోళ్లు లేరా..? అని అభిమానులు మండిపడుతున్నారు.
ఇటీవలే ఆమె షమీ వరల్డ్ కప్ ప్రదర్శనలపై కూడా స్పందిస్తూ.. షమీ వరల్డ్కప్ లో బాగా ఆడి చాలా డబ్బు సంపాదిస్తే తమకు మంచి జీవితం దొరుకుతుందని చెప్పిన విషయం తెలిసిందే. షమీ మంచి ఆటగాడే గానీ మంచి భర్త, తండ్రి మాత్రం కాదని ఆమె స్పష్టం చేసింది. ఒకవేళ అతడు మంచోడు అయితే తమ బతుకులు ఇలా ఉండేవి కావని చెప్పుకొచ్చింది.