మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. దీనిలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు హాట్కేకుల్లా అమ్ముడుపోతారు. ఎక్కువ మంది ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్ల కోసం పోటీలు పడతాయనే అంశంపై భారీగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్.. టీ20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన డేవిడ్ వార్నర్ కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అందరూ అనుకుంటున్నారు.
కానీ అలాంటిదేమీ ఉండదని, వార్నర్కు మహా అయితే 4 కోట్ల ధర వస్తుందని మాజీ దిగ్గజ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చెప్పాడు. గత ఐపీఎల్లో ఫామ్ లేమితో బాధపడినప్పటికీ.. అతను కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్లలో ఒకడనే విషయం మరువకూడదు. అదీగాక పలు జట్లకు కెప్టెన్లు కరువయ్యారు. అందుకే వార్నర్కు భారీ ధర ఖాయమని చాలా మంది అనుకుంటున్నారు.
అలాంటిదేమీ జరగదని చెప్పిన హాగ్.. వార్నర్ కన్నా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోసం గట్టి పోటీ ఉంటుదన్నాడు. గత ఐపీఎల్లో సరిగ వికెట్లు తీయలేకపోయినప్పటికీ.. అశ్విన్ కోసం మంచి పోటీ ఉంటుందని వివరించాడు. ఈ వేలంలో షమీ ధర రూ.5 కోట్ల మార్క్ చేరుకోవచ్చని చెప్పాడు. అదే సమయంలో అశ్విన్కు 5-7 కోట్ల ధర పలికే అవకాశం ఉందని పేర్కొన్నాడు.