న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ నుంచి షెడ్యూల్ కన్నా ముందే తప్పుకోనున్నట్లు తెలిసింది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్ నుంచి బంగ్లాదేశ్కు వచ్చే ప్రయాణికులు
14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే 15 రోజులు మీ ప్రణాళిక ఏంటో మాకు తెలియజేయాలని షకీబ్, ముస్తాఫిజుర్లను మేం కోరాం. ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి క్వారంటైన్ నిబంధనలు అనుసరించాలో కూడా మేం ఇప్పటికే
ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరామని బంగ్లా క్రికెట్ బోర్డు చీఫ్ నిజాముద్దీన్ చౌధురి తెలిపారు.
‘వాళ్లిద్దరూ ఏడు లేదా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ సూచించినట్లైతే వారు ఐపీఎల్ నుంచి షెడ్యూల్ కంటే ముందుగానే తిరిగి రావాల్సి ఉంటుంది. మేం బంగ్లాదేశ్ ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని’ చౌధురి వివరించారు. ఐపీఎల్లో షకీబ్ కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతుండగా, ముస్తాఫిజుర్ రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.