హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ రజత పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో స్నేహిత్, దివ్యా పరాగ్ చితాలే జోడీ 2-3 తేడాతో పయాస్జైన్, యశస్వినీ చేతిలో ఓటమిపాలైంది. ఇటీవలే వడోదరాలో జరిగిన టోర్నీలోనూ స్నేహిత్, దివ్య ద్వయం కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో తాము నిలకడగా రాణిస్తున్నామని, వచ్చే వారం జోర్డాన్లో జరిగే డబ్ల్యూటీ టోర్నీలోనూ దివ్యతో కలిసి బరిలోకి దిగుతున్నానని స్నేహిత్ పేర్కొన్నాడు.