హాస్టల్లో ఉన్నప్పుడు తాను ఎదుర్కున్న కష్టాలు, సీనియర్లు చేసిన ర్యాగింగ్ గురించి భారత స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్ సంచలన విషయాలు వెల్లడించింది. ఒడిషాలోని ఓ ప్రభుత్వ క్రీడా హాస్టల్లో ఇటీవలే రుచిక అనే డిగ్రీ అమ్మాయి సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ద్యుతీ పైవిధంగా స్పందించింది.
సోషల్ మీడియా వేదికగా ద్యుతీ స్పందిస్తూ.. ‘హాస్టల్లో ఉన్నప్పుడు నేను కూడా ర్యాగింగ్ బాధితురాలినే. నా సీనియర్స్ నాతో బాడీ మసాజ్ చేయించుకునేవాళ్లు. వాళ్ల బట్టలు ఉతకమనేవాళ్లు. నేను చేయను అని ఎదురుతిరిగితే నన్ను హింసించేవాళ్లు..’ అని పేర్కొంది.
ద్యుతీ.. 2006 నుంచి 2008 వరకు ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని ఓ స్పోర్ట్స్ హాస్టల్లో గడిపింది. ఇక డిగ్రీ చదువుతున్న రుచిక.. సీనియర్స్ ర్యాగింగ్ వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని లెటర్ రాసి తనువు చాలించింది. ఈ ఘటన ఒడిశాలో రాజకీయ దుమారం రేపుతున్నది.
తాజాగా రుచిక ఆత్మహత్య ఉదంతంపై స్పందిస్తూ.. ‘నేను హాస్టల్లో ఉన్నప్పుడు జరిగిన ఆ ఘటనలు నా మీద తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా అది నా మానసిక స్థితిని చాలా ప్రభావితం చేసింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆట మీద దృష్టి సారించడం చాలా కష్టం’అని తెలిపింది. తనపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడినప్పుడు పై అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని… పైగా కంప్లైంట్ ఇచ్చినందుకు తననే తిట్టేవారని ద్యుతీ తెలిపింది. ప్రస్తుతం ద్యుతీ కామన్వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్నది.