పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పొట్టి ప్రపంచకప్లో సత్తాచాటడమే తన ముందున్న లక్ష్యమని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్లో రాణించడమే అంతిమ లక్ష్యం. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు మరింత మెరుగవుతూ.. ముందుకు సాగుతున్నా. కోచ్, కెప్టెన్ మద్దతు ఉంది.
ఈ జట్టుతో కలిసి ఆడటాన్ని చాలా ఆస్వాదిస్తున్నా’ అని అన్నాడు. అశ్విన్తో మాట్లాడిన ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన కార్తీక్.. ఈ ఏడాది ఆసీస్లో జరుగనున్న మెగాటోర్నీలో ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి బాదుడే పరమావధిగా బీభత్సం సృష్టిస్తున్న కార్తీక్.. చివరి ఓవర్లలో పిడుగుల్లాంటి షాట్లతో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు.