ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. విజయ్ హజారే ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2021లోనూ పరుగులు సాధించిన షాను సెలెక్టర్లు పట్టించుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. అధిక బరువు ఉన్నాడన్న కారణంతోనే 21ఏండ్ల షాను ఎంపికచేయలేదని తెలిసింది.
పృథ్వీ తిరిగి భారత జట్టులోకి రావాలంటే కొంత బరువు తగ్గించుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ను షా ఉదాహరణగా తీసుకోవచ్చని, తన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని సూచించారు. తుది జట్టులో చోటు కోల్పోయిన తర్వాత తన బరువును గణనీయంగా తగ్గించుకొని మళ్లీ టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో పంత్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడని పేర్కొన్నారు.
‘పృథ్వీ 21ఏండ్ల వయసులో చాలా నిదానంగా ఉంటున్నాడు. అతను మరికొన్ని కిలోల బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియాలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతడు ఏకాగ్రత సమస్యలతో ఇబ్బందిపడ్డాడు. ఆసీస్ టూర్ నుంచి వచ్చాక చాలా కష్టపడ్డాడు. తనకు రిషబ్పంత్ చక్కటి ఉదాహరణ. పంత్ కొన్ని నెలల్లోనే ఈ సమస్యలన్నింటినీ అధిగమించినప్పుడు, పృథ్వీకి కూడా ఇది సాధ్యమవుతుందని’ బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి..