న్యూఢిల్లీ: డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్(Sourav Ganguly)పై .. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. టెస్టు క్రికెట్లో సెహ్వాగ్ బ్యాటింగ్ శైలినే మార్చేసినట్లు గుంగూలీ తెలిపారు. అన్ని జట్లలో నాణ్యమైన బౌలర్లు ఉన్న సమయంలో.. సెహ్వాగ్ దూకుడుగా ఆడిన తీరు టెస్టు మ్యాచ్ల స్వరూపాన్నే మార్చేసిందన్నారు. ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో సెహ్వాగ్, డయానా ఎదుల్జీ, అరవింద్ డిసిల్వా పేర్లను ప్రకటించిన నేపథ్యంలో గంగూలీ స్పందించారు.
సెహ్వాగ్కు రాసిన ప్రశంసాపత్రంలో గంగూలీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. నువ్వు బ్యాటింగ్ చేసిన తీరు నిన్ను ప్రత్యేక ఆటగాడిగా తీర్చిదిద్దిందని, టెస్టు క్రికెట్లో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ డైనమిక్స్నే మార్చేశావని, అప్పట్లో టెస్టు క్రికెట్ ప్రత్యేకమైందని, 2000 దశకంలో టెస్టు క్రికెట్లో నాణ్యమైన బౌలర్లు ఉండేవారని, కానీ వాళ్లను సెహ్వాగ్ ఈజీగా ఎదుర్కొనేవాడని గంగూలీ అన్నారు.
2009లో శ్రీలంకతో ఆడిన టెస్టులో 293 రన్స్ కొట్టిన తీరు హైలెట్ అని, ముత్తయ్య మురళీధరన్ లాంటి మేటి బౌలర్ను సెహ్వాగ్ ఎదుర్కొన్న తీరును ప్రశంసనీయమని గంగూలీ తెలిపారు. అన్ని ఫార్మాట్ల మ్యాచ్లను ఆడడం ఎంజాయ్ చేశావని, వన్డే క్రికెట్లో అద్భుతంగా ఆడావని, కానీ టెస్టుల్లో నువ్వు బెటర్ అని గంగూలీ కితాబు ఇచ్చాడు. సెహ్వాగ్ తన కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 మ్యాచ్లు ఆడాడు.