ఉత్కంఠ ఊపేసిన పోరులో ముంబై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఐపీఎల్ 1000వ మ్యాచ్లో రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ముంబై మరో మూడు బంతులు మిగిలుండగానే ఊదేసింది. యశస్వి జైస్వాల్ ఊచకోతతో.. రాయల్స్ భారీ స్కోరు చేస్తే.. రోహిత్ సేన అంతకుమించిన విధ్వంసం సృష్టించింది. గ్రీన్, సూర్యకుమార్, టిమ్ డేవిడ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకొని మరీ వీరబాదుడు బాదడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో ఆదివారం ప్రేక్షకులకు డబుల్ ఆనందాన్నిచ్చింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ వెయ్యో మ్యాచ్ పూర్తి చేసుకోగా.. చరిత్రాత్మక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. డబుల్ హెడర్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (62 బంతుల్లో 124; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్వితీయ శతకంతో చెలరేగగా. తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ముంబై బౌలర్లు ఇచ్చిన 25 ఎక్స్ట్రాలే రాయల్స్ ఇన్నింగ్స్లో రెండో అత్యధిక స్కోరు కావడం
గమనార్హం. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ 3, పియూష్ చావ్లా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (26 బంతుల్లో; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. వాంఖడే స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్యఛేదన కావడం విశేషం. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 1000వ మ్యాచ్ సందర్భంగా ఆట ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ఇరు జట్ల కెప్టెన్లకు ప్రత్యేక మెమొంటోలు అందించాడు.
రాజస్థాన్: 212/7 (జైస్వాల్ 124, బట్లర్ 18; అర్షద్ 3/39, పియూష్ 2/34), ముంబై: 19.3 ఓవర్లలో 214/4 (సూర్యకుమార్ 55, డేవిడ్ 45 నాటౌట్; అశ్విన్ 2/27)