దుబాయ్: అసలు కివీస్ ఆడుతోంది పసికూన జట్టుతోనేనా? అనేలా స్కాట్లాండ్ పోరాడింది. తొలుత బౌలింగ్లో రాణించిన ఈ జట్టు న్యూజిల్యాండ్ను కట్టడి చేసేలానే కనిపించింది. కానీ వెటరన్ గప్తిల్ (93) విజృంభించడంతో కివీస్ను అడ్డుకోలేకపోయింది. అయితే అతను అవుటైన తర్వాత మళ్లీ కివీస్పై ఒత్తిడి పెట్టిన స్కాట్లాండ్.. వారినీ మరీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్ జట్టు 172/5తో ఇన్నింగ్స్ ముగించింది.
173 పరుగుల లక్ష్యఛేధనలో బౌల్ట్, సౌథీ, సోధి వంటి నాణ్యమైన బౌలర్లను ఎదుర్కోవడం స్కాట్లాండ్ వంటి జట్టుకు సాధ్యమేనా? అని ఆలోచించిన వారందరికీ ఆ జట్టు పెద్ద షాకే ఇచ్చింది. ఆరంభం నుంచే తాము ఓడిపోవడానికి మైదానంలోకి రాలేదనే సందేశం పంపిన ఆ జట్టు బ్యాట్స్మెన్ వరుసగా బౌండరీలు బాదుతూ ఆత్మవిశ్వాసంతో కనిపించారు.
వరుస విరామాల్లో కెప్టెన్ కైల్ కోట్జర్ (17), జార్జ్ మున్సే (22) వికెట్లు కూల్చిన అయితే బౌల్ట్, సోధి ఆ జట్టును దెబ్బతీశారు. అయితే మాథ్యూ క్రాస్ (27), రిచీ బెర్రింగ్టన్ (20) కాసేపు ఆశలు కల్పించారు. వీరితోపాటు కాలమ్ మెక్లాయిడ్ (12) కూడా పెవిలియన్ చేరడంతో స్కాట్లాండ్ ఆశలు ఆవిరయ్యాయని అంతా అనుకున్నారు.
కానీ చివర్లో క్రిస్ గ్రీవ్స్ (8 నాటౌట్)తో కలిసి మైకేల్ లీస్క్ (42 నాటౌట్) తమ జట్టును గెలిపించేలా కనిపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. కివీస్కు పోరాడే స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించిన మార్టిన్ గప్తిల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.