SAvsAUS: ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికాకు మరోసారి రిక్తహస్తమే మిగిలింది. ఇన్నాళ్లూ ఐసీసీ టోర్నీలలో వర్షం, డీఆర్ఎస్లు ఆ జట్టు ఫైనల్ చేరకుండా అడ్డుకుంటే ఇప్పుడు సఫారీల బ్యాటింగ్ వైఫల్యంతో దక్షిణాఫ్రికాకు మరోసారి నిరాశ తప్పలేదు. భారత్లో జరుగుతున్న ఈ మెగా టోర్నీ ఆసాంతం తనదైన దూకుడైన బ్యాటింగ్, బెంబేలెత్తించే బౌలింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న సఫారీలు.. కీలకమైన నాకౌట్ దశలో తేలిపోయారు. బ్యాటింగ్లో విఫలమైనా స్పిన్నర్లు కట్టడి చేయడంతో ఒక దశలో మ్యాచ్ను ఉత్కంఠగా మార్చినా కంగారూలు పట్టు విడవకుండా ఆడటంతో సఫారీల పోరాటం మరోసారి సెమీస్కే పరిమితమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా నిర్దేశించిన 213 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారూలు..47.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఛేదనలో ట్రావిస్ హెడ్ (48 బంతుల్లో 62, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30, 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29, 1 ఫోర్, 4 సిక్సర్లు), ఆఖర్లో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్లు రాణించి ఆసీస్ను రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్కు చేర్చారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా.. ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగబోయే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు వచ్చిన కంగారూలకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. డేవిడ్ వార్నర్ 18 బంతుల్లోనే ఒక బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా దంచికొట్టడంతో ఆసీస్.. 6 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. రబాడా వేసిన ఆరో ఓవర్లో వార్నర్ రెండు, హెడ్ ఒక సిక్సర్ బాదారు. పేసర్లు ప్రభావం చూపకపోవడంతో బవుమా ఏడో ఓవర్లోనే పార్ట్ టైమ్ స్పిన్నర్ మార్క్రమ్కు బంతినిచ్చాడు. మార్క్రమ్ తొలి బంతికే వార్నర్ను బౌల్డ్ చేయడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయిది.
వికెట్ల వేట మొదలు..
ఆరంభం అదిరిపోయినా ఒక్క వికెట్ పడగానే ఆసీస్ కూడా తడబడింది. వార్నర్ స్థానంలోవచ్చిన మిచెల్ మార్ష్ పరుగుల ఖాతా తెరవకుండానే రబాడా బౌలింగ్లో డసెన్ సూపర్బ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. గెరాల్డ్ కొయెట్జ్ వేసిన 12వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన హెడ్.. అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ హెడ్ను 15వ ఓవర్లో కేశవ్ మహారాజ్ బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్లో తొలి బంతికే హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పట్టు బిగించిన సఫారీలు..
పిచ్కు స్పిన్కు అనుకూలించడం.. షంసీ, మహారాజ్ల బంతులకు కంగారూలు తంటాలు పడుతుండటంతో బవుమా వాళ్లతోనే ఓవర్లు వేయించాడు. లబూషేన్ (31 బంతుల్లో 18, 2 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్ కు 45 పరుగులు జోడించాడు. కానీ షంసీ 22వ ఓవర్లో ఐదో బంతికి లబూషేన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. షంసీ తన మరుసటి ఓవర్లోనే గ్లెన్ మ్యాక్స్వెల్ (1)ను కూడా బౌల్డ్ చేసి సఫారీలు మ్యాచ్ మీద పట్టుబిగించేలా చేశాడు.
ఆఖర్లో ఉత్కంఠ..
మ్యాచ్ మీద దక్షిణాఫ్రికా పట్టుబిగిస్తున్న తరుణంలో స్టీవ్ స్మిత్ తన అనుభవాన్నంతా ఉపయోగించి మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జోష్ ఇంగ్లిస్తో కలిసి ఆరో వికెట్కు 59 బంతుల్లో 37 పరుగులు జోడించిన స్మిత్.. సఫారీ స్పిన్ ద్వయాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు కవ్వించే బంతులు వేసినా సంయంనం కోల్పోకుండా ఆడాడు. మరో ఎండ్లో జోస్ ఇంగ్లిస్ (49 బంతుల్లో 28, 3 ఫోర్లు) కూడా స్మిత్కు చక్కని సహకారం అందించాడు. కానీ కొయెట్జ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అతడు వేసిన 34వ ఓవర్లో మూడో బంతికి డికాక్ క్యాచ్ పట్టడంతో స్మిత్ కథ ముగిసింది. స్మిత్ నిష్క్రమించినా ఇంగ్లిస్ క్రీజులో ఉండటంతో కంగారూలు ధీమాగానే ఉన్నారు. కానీ సౌతాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులను అడ్డుకుంది. అదీగాక కొయెట్జ్ మరోసారి సఫారీలకు బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన 40వ ఓవర్లో ఇంగ్లిస్ను బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. అయితే.. ఆఖర్లో మిచెల్ స్టార్క్ ( 38 బంతుల్లో 16 నాటౌట్, 2 ఫోర్లు), పాట్ కమిన్స్ (29 బంతుల్లో 14 నాటౌట్, 2 ఫోర్లు)లు నింపాదిగా ఆడి కంగారూల విజయాన్ని ఖరారుచేశారు. ఈ మ్యాచ్లో సఫారీ ఫీల్డింగ్ కూడా నాసిరకంగానే ఉండటం కూడా ఆ జట్టు ఓటమికి కారణమైంది. ఫీల్డింగ్కు నానార్థంగా ఉండే ఆ జట్టు ఆటగాళ్లు ఐదు క్యాచ్లు మిస్ చేయడం గమనార్హం.
అంతకుముందు ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. మిల్లర్ (101) సెంచరీతో ఆదుకోగా క్లాసెన్ (47) రాణించాడు