హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు ఇవాళ ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్లోకి వెళ్లి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ గేమ్లో గోల్ కీపర్ సవితా పూనియా ( Savita Punia ) కీలకంగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఆమె 9 గోల్స్ సేవ్ చేసి ఇండియా విజయంలో ప్రత్యేక పాత్ర పోషించింది. దూకుడుగా గోల్పోస్టును అటాక్ చేస్తున్న ఆస్ట్రేలియన్లను సవితా పూనియా ధీటుగా అడ్డుకున్నది.
సవితా పూనియా.. హర్యానాలోని సిర్సాలో ఉన్న హాకీ నర్సరీలో శిక్షణ పొందింది. సుందర్ సింగ్ కర్బా ఆమెకు కోచ్గా ఉన్నారు. స్వగ్రామం జోద్కా నుంచి ఆమె ప్రభుత్వ బస్సులో ప్రయాణించేది. గోల్కీపర్ కిట్స్తో ఆమె కోచింగ్కు వెళ్లేది. బస్సు కండక్టర్లు ఎవరు ఆ గోల్కీపర్ కిట్ను తాకినా ఆమె నోచ్చుకునేది. ఇవాళ్టి మ్యాచ్లో ఆసీస్ ప్లేయర్ల నుంచి బాల్ను దూరంగా పెట్టేందుకే పునియా ఎన్నో ప్రయత్నాలు చేసింది.
సవితా పూనియా తండ్రి ఓ ఫార్మసిస్టు. తాతయ్య రంజిత్ సింగ్ ఓ రైతు. అయితే హ్యాకీ మ్యాచ్ కామెంట్రీలను తాత రంజిత్ రేడియోలో వీనేవారు. ఆ సమయంలో సవితా పూనియా ఆ ఆట గురించి తెలుసుకుంది. స్థానికంగా జరిగే పోటీలకు తాతతో కలిసి వెళ్లేది. నిజానికి ఫార్వర్డ్ లేదా మిడ్ఫీల్డర్ ప్లేయర్గా సవితా ఎదగాలనుకున్నది. కానీ తాత కోరిక మేరకు ఆమె గోల్కీపర్గా రూపుదిద్దుకున్నది.
గోల్కీపింగ్ నేర్చుకుంటున్న రోజుల్లోనూ సవితా పూనియా ఫుట్వర్క్, ఆర్మ్, లెగ్ పొజిషన్స్ చురుగ్గా ఉండేదని చిన్ననాటి కోచ్ కర్బా తెలిపారు. మిడ్ఫీల్డర్లు, ఫార్వర్డ్ ఆటగాళ్లతో ఆమె ఎప్పుడు ఎక్కువ సమయం గడుపుతుందని, ఎందుకంటే వారి ఆటశైలిని అర్థం చేసుకునేందుకు ఆమె ప్రయత్నించేది ఆ కోచ్ తెలిపారు. 2017లో ఆసియా కప్ ను ఇండియా గెలిచింది. ఆ టోర్నీలో సవితా పూనియా అద్భుతమైన గోల్ కీపింగ్ చేసింది. బెస్ట్ గోల్కీపర్గా ఆమెకు అవార్డు ఇచ్చారు. 2018 ఏషియన్ గేమ్స్లోనూ ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోవడం విశేషం.