నేటి నుంచి ఇరానీ కప్
రాజ్కోట్: టీమ్ఇండియా తలుపు తట్టేందుకు ఎదురుచూస్తున్న కుర్రాళ్ల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శనివారం నుంచి జరుగనున్న ఇరానీ కప్లో 2019-20 రంజీ ట్రోఫీ విన్నర్ సౌరాష్ట్రతో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తలపడనుంది. సౌరాష్ట్ర తరఫున భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా బరిలోకి దిగనుండగా.. రెస్టాఫ్ ఇండియా టీమ్కు తెలుగు ఆటగాడు హనుమ విహారి సారధ్యం వహించనున్నాడు. మయాంక్ అగర్వాల్, ప్రియాంక్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్ రూపంలో ఐదుగురు స్పెషలిస్ట్ ఓపెనర్లు రెస్టాఫ్ ఇండియా తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. ఇటీవల న్యూజిలాండ్-‘ఎ’తో సిరీస్లో రాణించిన పలువురు ఆటగాళ్లు ఫామ్ కొనసాగించాలని చూస్తున్నారు. ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ రెస్టాఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహింస్తుండగా.. ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్, ముఖేశ్ తమ బౌలింగ్ వాడిని పరీక్షించుకోనున్నారు.