న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తొలి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ-500 టోర్నీలో సానియా మీర్జా-షుయె జాంగ్ (చైనా) జంట విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ సానియా-జాంగ్ జోడీ 6-3, 6-2తో మూడో సీడ్ క్యాథెలిన్ క్రిస్టియన్ (అమెరికా)-ఎరిన్ రౌట్లిఫ్ (న్యూజిలాండ్) ద్వయంపై గెలుపొందింది. 64 నిమిషాల్లో ముగిసన పోరులో ఒక ఏస్ కొట్టిన సానియా జోడీ.. 3 బ్రేక్ పాయింట్లు సాధించి ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేసింది. కెరీర్లో 43వ టైటిల్ సాధించిన సానియా మాట్లాడుతూ.. ‘ఈ విజయం ఎంతో ప్రత్యేకం. కెరీర్లో ఇది 43వ టైటిల్ కాగా.. తల్లి అయ్యాక ఇదే మొదటి డబ్ల్యూటీఏ-500 ట్రోఫీ. మ్యాచ్ ఆరంభానికి ముందు నా కుమారుడు ఇజాన్ “అమ్మా ట్రోఫీ తీసుకు రా” అని అన్నాడు. అతడి కోరిక నెరవేర్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉంది’ అని చెప్పింది.