టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడింది. 20 ఏండ్ల క్రితం తొలి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో.. క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో సానియా తన సుదీర్ఘ కెరీర్కు ఆదివారం భావోద్వేగ వీడ్కోలు పలికింది. మరెందరో సానియాలను తయారు చేయడమే తన లక్ష్యమంటూ అభిమానులకు అల్విదా చెప్పింది. వీడ్కోలు వేదికపై సానియాను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ సన్మానించారు.
రెండు దశాబ్దాల క్రితం ఎక్కడ మొదలు పెట్టిందో.. అక్కడే సానియా మీర్జా చివరి మ్యాచ్ ఆడింది! తొలి డబ్ల్యూటీఏ టైటిల్ (2004లో) నెగ్గిన ఎల్బీ స్టేడియంలో.. ఆనంద భాష్పాల నడుమ సానియా అల్విదా చెప్పింది! ఇప్పటికే ప్రొఫెషనల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్.. ఆదివారం ఎల్బీ టెన్నిస్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. కేంద్ర, రాష్ట్ర మంత్రుల నుంచి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిచంగా..స్టేడియం మొత్తం సానియా.. సానియా.. నామస్మరణతో మోతెక్కిపోయింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తన అసమాన ప్రతిభతో రెండు దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. సొంతగడ్డపై చివరి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేసింది. ఆరు గ్రాండ్స్లామ్ టైటిళ్లు.. 43 డబ్ల్యూటీఏ ట్రోఫీలు చేజిక్కించుకొని భారత టెన్నిస్లో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన సానియా.. ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ ఆడింది. 20 ఏండ్ల కింద ఎక్కడ ప్రారంభించిందే అక్కడే సానియా ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ.. ఆటకు అల్విదా చెప్పింది. గత నెలలో దుబాయ్ ఓపెన్తోనే ప్రొఫెషనల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. టెన్నిస్ ఓనమాలు నేర్చిన ఎల్బీ స్టేడియంలో ఆడాలనే ఉద్దేశంతో ఆదివారం ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొంది.
మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో కలిసి బెతాని-ఇవాన్ జంటతో తలపడింది. అనంతరం రోహాన్ బోపన్నతో కలిసి మరో మ్యాచ్ ఆడింది. ఈ పోరుకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, చాముండేశ్వరినాథ్, సినీ నటుడు దుల్కర్ సల్మాన్, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, రాబిన్ ఊతప్ప, అనన్య బిర్లా, హుమా ఖురేషీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయులు హజరయ్యారు. సానియా చివరిసారి ఆడుతున్న మ్యాచ్ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.
ఇదో అద్భుత జర్నీ
మ్యాచ్ అనంతరం 36 ఏండ్ల సానియా మాట్లాడుతూ.. ‘దాదాపు 20 ఏండ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ఎందరో ప్లేయర్లు దేశం తరఫున ఒక్క మ్యాచ్ అయినా ఆడేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అవకాశం నాకు దక్కింది. ఇక్కడ నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. 2002 జాతీయ క్రీడల్లో ఇక్కడ పతకం సాధించా.. 2004లో డబ్ల్యూటీఏ హైదరాబాద్ ఓపెన్ టైటిల్ ఇక్కడే సాధించా. టెన్నిస్ను కెరీర్గా ఎంచుకోవడం సాహసంతో కూడిన సమయంలో నా కుటుంబం ఆ దిశగా ప్రోత్సహించింది.
సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్ ఆడాలనుకున్నా.. నా కోరికను నిజం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్నాళ్లు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’అని చెప్పింది. ఈ క్రమంలో అభిమానులు సానియా.. సానియా అని అరుస్తుండగా.. భావోద్వేగానికి గురైన సానియా కండ్ల నిండా నీళ్లతో తన ప్రసంగం కొనసాగించింది. ఇవి కన్నీళ్లు కావు, ఆనంద భాష్పాలని పేర్కొంది. భవిష్యత్తులో ఈ స్టేడియం నుంచి మరెందరో సానియాలు రావాలని దేశం క్రీడలకు నెలవుగా మారాలని ఆమె ఆకాంక్షించింది. ‘ఆటకు మాత్రమే వీడ్కోలు పలికా.. మైదానం బయట టెన్నిస్తో నా అనుబంధం కొనసాగుతుంది. భవిష్యత్తులో తెలంగాణ క్రీడారంగానికి, భారత క్రీడారంగానికి నా సేవలందిస్తా’అని సానియా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో సానియా నాలుగేండ్ల కుమారుడు ఇజ్హాన్ మీర్జా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
దేశానికే గర్వకారణం..
సానియా చివరి మ్యాచ్ అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ.. సానియా రాష్ర్టానికే కాకుండా దేశానికే గర్వకారణమని అన్నారు. అద్భుత కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిన మీర్జా.. భవిష్యత్తులోనూ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సానియా చివరి మ్యాచ్ అనంతరం రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ఆమెను సన్మానించారు.