విశ్వక్రీడల చరిత్రలో నాలుగోసారి బరిలోకి దిగనున్న తొలి భారత మహిళగా రికార్డుల్లోకి ఎక్కనున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ సారైనా పతకం పట్టాలని తహతహలాడుతున్నది. రియో ఒలింపిక్స్లో పతకం అంచులదాక వచ్చి చివరి క్షణాన ఓటమి వైపు నిలిచిన ఈ హైదరాబాదీ.. ఈ సారి తన కల నెరవేర్చుకోవాలని చూస్తున్నది. గ్రాండ్స్లామ్స్, డబ్ల్యూటీఏ టైటిల్స్ ఎన్ని ఉన్నా.. ఒలింపిక్ మెడల్ మీదకు రాలేవంటున్న సానియా మీర్జా టోక్యో ఏర్పాట్లపై ప్రత్యేక కథనం..
సింగిల్స్ బరిలో నిలిచినంత కాలం భారత అగ్రస్థానం.. డబుల్స్లో ప్రపంచ నంబర్వన్.. గ్రాండ్స్లామ్స్లో ఆరు టైటిల్స్.. డబ్ల్యూటీఏలో 42 ట్రోఫీలు.. ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు తన పేరిట రాసుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఒలింపిక్ పతకం పట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే మూడుసార్లు విశ్వక్రీడల్లో పాల్గొన్న ఈ హైదరాబాదీ.. టోక్యోలో బరిలో దిగడం ద్వారా ఒలింపిక్స్లో ఎక్కువసార్లు పాల్గొన్న భారత మహిళగా రికార్డుల్లోకెక్కనుంది. రియో (2016) ఒలింపిక్స్ మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్నతో కలిసి తృటిలో పతకం చేజార్చుకున్న సానియా.. ఈ సారి యంగ్ ప్లేయర్ అంకితా రైనాతో కలిసి మహిళల డబుల్స్లో పోటీపడనుంది. రియో తర్వాత కోర్టుకు దూరమైన సానియా.. కుమారుడు పుట్టాక తిరిగి రాకెట్ పట్టింది. మాతృత్వాన్ని ఆస్వాదించాక నాలుగు నెలల్లోనే 26 కేజీల బరువుతగ్గి రీఎంట్రీ ఇచ్చిన మీర్జా.. తాజాగా మహిళల డబుల్స్లో టైటిల్ పట్టి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించింది. అంకితతో కలిసి సానియా ఇదే జోరు కొనసాగిస్తే.. భారత పతక నిరీక్షణకు ఫుల్స్టాప్ పడటం పెద్ద కష్టం కాదు. ప్రపంచంలోని ఏ ఇతర టెన్నిస్ ఆటగాడికి సాధ్యం కానివిధంగా.. 1992 నుంచి 2016 వరకు వరుసగా ఏడు ఒలింపిక్స్లో పాల్గొన్న లియాండర్ పేస్.. ఈ సారి విశ్వక్రీడలకు అర్హత సాధించలేకపోగా.. పురుషుల సింగిల్స్లో సుమీత్ నాగల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఒలింపిక్స్లో మనవాళ్లు
మహిళల డబుల్స్
సానియా మీర్జా
అంకితా రైనా
పురుషుల సింగిల్స్
సుమీత్ నాగల్
ఒలింపిక్ మెడల్
లియాండర్ పేస్ (కాంస్యం)
1996 అట్లాంటా