బెంగళూరు: వచ్చే వారం జరుగనున్న బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తెలుగు ఆటగాడు సాకేత్ మైనేనికి వైల్డ్కార్డ్ ఎంట్రీ లభించింది. ఇప్పటి వరకు రెండు ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 34 ఏండ్ల సాకేత్.. ప్రస్తుతం పుణెలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ‘కరోనా కారణంగా గత కొంత కాలంగా స్వదేశంలో ఎక్కువ టోర్నీలు జరుగలేదు. బెంగళూరు ఓపెన్లో కొన్ని మంచి మ్యాచ్లు ఆడా.. అదే స్ఫూర్తితో ముందుకు సాగాలనుకుంటున్నా’అని సాకేత్ గురువారం పేర్కొన్నాడు. భారత్ నుంచి ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్కుమార్ రామనాథన్ మాత్రమే నేరుగా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించగా.. వైల్డ్కార్డ్ ద్వారా మరో ఇద్దరు ఆటగాళ్లను శుక్రవారం ఎంపిక చేయనున్నారు. ప్రధాన టోర్నీకి ముందు ఆదివారం నుంచి క్వాలిఫయింగ్ రౌండ్లు ప్రారంభం కానున్నాయి.