న్యూఢిల్లీ: రెండు సార్లు కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెలక్షన్ ట్రయల్స్ నుంచి వైదొలిగింది. కామన్వెల్త్, ఆసియా గేమ్స్ అర్హత కోసం నిర్వహించే ట్రయల్స్కు దూరంగా ఉండాలని లండన్ ఒలింపిక్స్ పతక విజేత నిర్ణయించుకుంది. ఈ మేరకు జాతీయ బ్యాడ్మింటన్ సంఘం(బాయ్)కు సమాచారం అందించింది. 32 ఏండ్ల సైనా గత కొంత కాలంగా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నది. ప్రస్తుతం ఫామ్లో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
థామస్, ఉబర్ కప్తో పాటు ఫ్రెంచ్ ఓపెన్లో సైనా గాయాల బారిన పడింది. అప్పటి నుంచి కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. ఇటీవల వరుసగా జరిగిన ఇండియా, జర్మన్, ఆల్ ఇంగ్లండ్, స్విస్ ఓపెన్ టోర్నీల్లో రెండో రౌండ్ను దాటలేకపోవడం చూస్తుంటే సైనా తన లయను కోల్పోయినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ట్రయల్స్కు దూరమైందని సమాచారం. నిరుడు ఓర్లీన్స్ మాస్టర్స్లో సెమీస్, స్పెయిన్, మలేషియా మాస్టర్స్లో క్వార్టర్స్ వరకు చేరడమే ఇప్పటివరకు సైనా అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
15 నుంచి ట్రయల్స్
ఈనెల 15 నుంచి 20 మధ్య కామన్వెల్త్, ఆసియా గేమ్స్ కోసం ట్రయల్స్ జరుగనున్నాయి. కామన్వెల్త్ క్రీడలకు మహిళలు, పురుషుల విభాగంలో పది మంది చొప్పున , ఆసియా, థామస్ కప్, ఉబర్ కప్ టోర్నీకి 20 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ట్రయల్స్లో సత్తా చాటిన వారు మెగాటోర్నీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.