న్యూఢిల్లీ: ఆరంభ సీజన్ టోర్నీ ఇండియా ఓపెన్ సూపర్-500లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, లక్ష్యసేన్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రత్యర్థి టెరెజా స్వాబికోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలుగడంతో మాజీ చాంపియన్ సైనా రెండో రౌండ్కు చేరుకుంది. అంతకుముందు మొదటి గేమ్లో 22-20తో సైనా పైచేయి సాధించింది. రెండో గేమ్ ప్రారంభం కాగానే ప్రత్యర్థి గాయంతో వైదొలిగింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యువ షట్లర్ లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ముందంజ వేశారు. ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య విజేత లక్ష్య 21-15, 21-7తో అదమ్ ఎల్గమల్ (ఈజిప్ట్)పై నెగ్గగా.. ప్రణయ్ 21-14, 21-7తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై విజయం సాధించారు. మిగతా సింగిల్స్లో రాహుల్ యాదవ్, మిథున్ మంజునాథ్ ప్రిక్వార్టర్స్కు ప్రవేశించగా.. డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని ద్వయం, సాత్విక్సాయిరాజు- చిరాగ్ శెట్టి జోడీలు ముందంజ వేశాయి.