Virendra Sehwag : భారత జట్టుకు ఆడిని విజయవంతమైన ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ జోడీ ఒకటి. వీళ్లిద్దరూ శుభారంభాలు ఇచ్చి ఎన్నో మ్యాచులు గెలిపించారు. 2003 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో మ్యాచ్ సమయంలో తనకు, సచిన్ మధ్య జరిగిన సరదా సంభాషణను వీరూ తాజాగా వెల్లడించాడు. ఆరోజు వసీం అక్రమ్ తొలి ఓవర్ తొలి బంతిని ఎదుర్కోవాలని సెహ్వగ్, సచిన్ను అడిగాడట. అందుకు సచిన్ ససేమిరా అన్నాడట. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సందర్భంగా మాజీ డాషింగ్ ఓపెనర్ ఇలా వివరించాడు.
పండిత్ జీ చెప్పాడని…
‘అది పాక్ ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్.. పాక్ స్టీడ్స్టర్ వసీం అక్రమ్ నుంచి నన్ను కాపాడు. అతను తొలి ఓవర్ వేస్తే నేను అవుట్ కావొచ్చు. ఎందుకంటే.. నేను ఎడమచేతి వాటం పేసర్ల తొలి బంతిని ఎదుర్కోవడంలో విఫలం అవుతున్నా. శ్రీలంకతో మ్యాచ్లో చమిందా వాస్, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్ బౌలింగ్లో చాలాసార్లు అవుట్ అయ్యాను’ అని సచిన్తో చెప్పాను. అందుకు అతను ‘లేదు.. నేను కొన్ని విషయాలను గట్టిగా నమ్ముతాను. నా పండిత్ జీ నన్ను రెండో స్థానంలోనే ఆడమని చెప్పాడు’ అని బదులిచ్చాడు. దాంతో..’నువ్వు ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాటర్వి. అలాంటిది నువ్వు పండిత్ జీ గురించి మాట్లాడడం ఏంటి?’ అని అన్నాను. అయినా కూడా సచిన్ ‘లేదు.. నేను 2వ స్థానంలోనే ఆడతాను. నువ్వు తొలి బంతిని ఎదుర్కో..’ అని చెప్పాడు.
లంచ్ సమయంలో మళ్లీ సచిన్ను స్ట్రయిక్ తీసుకోవడం గురించి అడిగాను. హెడ్ఫోన్ పెట్టుకున్న సచిన్ నా మాటలు విని వీపు నెమ్మదిగా చేతితో ఒకటి చరిచాడు. ‘వెళ్లు.. వెళ్లి ప్యాడ్స్ కట్టుకో. నేను స్ట్రయిక్ తీసుకోను’ అని అన్నాడు. మైదానంలోకి వెళ్లేందుకు మెట్లు దిగుతుండగా కూడా మళ్లీ మాస్టర్ బ్లాస్టర్ను రిక్వెస్ట్ చేశాను. అప్పటికీ అతను నో అనే బదులిచ్చాడు. అయితే.. 30 యార్డుల వలయంలోకి వెళ్లగానే సచిన్ కీపర్ వైపు నడవడం మొదలుపెట్టాడు. అతడిని చూసి ‘హమ్మయ్య.. ఈరోజు నా లక్కీ డే’ అనుకున్నా అని సెహ్వగ్ వెల్లడించాడు.
పాక్ బౌలర్లను చితక్కొట్టిన సచిన్
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 273 రన్స్ చేసింది. వరల్డ్ కప్లో భారత్ మీద అత్యధిక స్కోర్ నమోదు చేసింది. దాంతో మ్యాచ్ గెలవాలంటే ఆది నుంచే వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి పాక్ బౌలర్ల మీద ఎదరుదాడికి దిగాలి అనుకున్నాడు సచిన్. అందుకని స్ట్రయికింగ్ తీసుకున్నాడు. 98 రన్స్తో చెలరేగాడు. యువరాజ్ సింగ్ 50, రాహుల్ ద్రావిడ్ 44 రన్స్తో రాణించడంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.