ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ప్లాస్మా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాస్టర్ పేర్కొన్నాడు. వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్లో ఆడిన సచిన్ గత నెల 27న కొవిడ్-19 బారిన పడ్డాడు. దీంతో ముందు జాగ్రత్తగా దవాఖానలో చేరిన సచిన్.. 21 రోజుల ఐసొలేషన్ తర్వాత మహమ్మారి నుంచి తేరుకున్నాడు. శనివారం 48వ పుట్టిన రోజు జరుపుకున్న సచిన్ తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘కరోనా నుంచి కోలుకోవడం సంతోషంగా ఉంది. డాక్టర్ల సూచన మేరకు ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కొవిడ్-19తో బాధపడుతున్న పేషెంట్ల కోసం ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు మరింత మంది ముందుకు రావాల్సిన అవసరముంది. కరోనా సమయంలో నేను సానుకూల దృక్పథంతో ఉండేందుకు సహకరించిన వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు’ అని సచిన్ అన్నాడు.