ఐపీఎల్లో మరో మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది! బంతి బంతికి ఉత్కంఠ రేపుతూ ఆఖరి గెలుపు దోబూచులాడిన పోరులో పంజాబ్కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్దే పైచేయి అయ్యింది. 148 పరుగుల లక్ష్యఛేదనలో పడుతూ లేస్తూ సాగిన రాజస్థాన్ సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ కింగ్స్పై దిమ్మతిరిగే రీతిలో పంజా విసిరింది. జైస్వాల్, తనుశ్ మోస్తారు శుభారంభంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రాజస్థాన్..పంజాబ్ బౌలింగ్ ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో హెట్మైర్ వీరవిహారంతో రాయల్స్ గెలుపు సంబురాల్లో నిలువగా, పంజాబ్కు మరోమారు సొంత ఇలాఖాలో నిరాశే ఎదురైంది. అవేశ్ఖాన్, కేశవ్మహారాజ్ సూపర్ బౌలింగ్తో పంజాబ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
IPL | ముల్లాన్పూర్: సొంత ఇలాఖాలో పంజాబ్ కింగ్స్కు మరో పరాభవం. సన్రైజర్స్ హైదరాబాద్తో గత మ్యాచ్ను తలపిస్తూ రాజస్థాన్తో పోరులో పంజాబ్ గెలిచే పరిస్థితుల్లో నుంచి ఓటమి వైపు నిలిచింది. శనివారం అభిమానులకు పసందైన విందు అందించిన మ్యాచ్లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్పై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో రాయల్స్ 10 పాయింట్లతో టాప్గేర్లో దూసుకెళుతుంటే..నిలకడలేమికి కేరాఫ్గా నిలుస్తూ పంజాబ్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొట్టుమిట్టాడుతున్నది. తొలుత కేశవ్ మహారాజ్(2/23), అవేశ్ఖాన్(2/34) ధాటికి పంజాబ్ 20 ఓవర్లలో 147/8 స్కోరు చేసింది. 103 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో ఆఖర్లో అశుతోష్శర్మ(16 బంతుల్లో 31, ఫోర్, 3 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో గౌరవప్రదమైన స్కోరు దక్కించుకుంది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్స్..19.5 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. యశస్విజైస్వాల్(39), హెట్మైర్(10 బంతుల్లో 27 నాటౌట్, ఫోర్, 3సిక్స్లు) మెరుగ్గా రాణించారు. రబాడ(2/18), సామ్ కరాన్(2/25) రెండేసి వికెట్లు తీశారు. హెట్మైర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
పంజాబ్ పడుతూ లేస్తూ: టాస్గెలిచిన రాజస్థాన్..పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ గాయం కారణంగా మ్యాచ్కు దూరం కాగా, ఆతని స్థానంలో అతర్వ తైదే(15) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్లోనైనా బ్యాటు ఝులిపిస్తాడనుకున్న జానీ బెయిర్స్టో(15) మరోమారు నిరాశపరిచాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 27 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రభ్సిమ్రన్సింగ్(10) స్వల్ప స్కోరుకే పరిమితం కాగా, తాత్కాలిక కెప్టెన్ సాసమ్ కరాన్(6) తీవ్రంగా నిరాశపరిచాడు. లీగ్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సఫారీ స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్..బెయిర్స్టో, కరాన్ను ఔట్ చేసి పంజాబ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. భారీ ఆశలు పెట్టుకున్న జితేశ్శర్మ(29) అంతో ఇంతో బ్యాటు ఝులిపించాడు. లివింగ్స్టోన్(21)తో కలిసి పంజాబ్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అవేశ్ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జితేశ్ ఔట్ కావడంతో ఆరో వికెట్కు 33 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్పడింది. గత మ్యాచ్ల్లో దుమ్మురేపిన శశాంక్సింగ్ (9) ఈసారి సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు. ఆఖ ర్లో అశుతోష్శర్మ మూడు భా రీ సిక్స్లు, ఫోర్తో చెలరేగడంతో పంజాబ్ పరువు దక్కించుకోల్గింది. లేకపోతే 120లోపే చాపచుట్టేసేది.
హెట్మైర్ హిట్: పంజాబ్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో రాజస్థాన్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(39), తనుశ్ కొటియాన్(24) ఒకింత మెరుగైన శుభారంభం అందించారు. లివింగ్స్టోన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన తనుశ్ ఔట్ కావడంతో తొలి వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్పడింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శాంసన్(18)..జైస్వాల్కు జతకలిశాడు. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న జైస్వాల్..ఈ పోరులో ఆకట్టుకున్నాడు. రబాడ బౌలింగ్లో షాట్ కోసం ప్రయత్నించిన జైస్వాల్..హర్షల్ పటేల్ క్యాచ్తో రెండో వికెట్గా వెనుదిరిగాడు. మరోమారు బౌలింగ్కు దిగిన రబాడ..ఈసారి శాంసన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆదుకుంటాడనుకున్న రియాన్ పరాగ్(23), ధృవ్ జురెల్(6) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో పంజాబ్ గెలుపుపై ఆశలు చెలరేగాయి. అయితే చివరి ఓవర్లో విజయానికి 10 పరుగులు ఆవసరమైన దశలో మొదటి రెండు బంతుల్లో పరుగులు చేయని హెట్మైర్ రెండు భారీ సిక్స్లతో మ్యాచ్కు తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
పంజాబ్: 20 ఓవర్లలో 147/8 (అశుతోష్ 31, జితేశ్ 29, మహారాజ్ 2/23, అవేశ్ 2/34),
రాజస్థాన్: 19.5 ఓవర్లలో 152/7 (జైస్వాల్ 39, హెట్మైర్ 27 నాటౌట్, రబాడ 2/18, కరాన్ 2/25)