IPL 2024 | ఐపీఎల్లో ప్లేఆఫ్స్కు చేరడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఇది తొమ్మిదోసారి
లీగ్లో వరుసగా ఆరు ఓటములు, ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది.
17 ఏండ్ల ఐపీఎల్లో చెన్నై ప్లేఆఫ్స్కు అర్హత సాధించకపోవడం ఇది మూడోసారి (రెండేండ్లు నిషేధం మినహాయించి)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అద్భుతం చేసింది! అవును ఆశలు లేని స్థితి నుంచి పోరాటాన్ని అణువణువునా నింపుకుంటూ సంచలన ప్రదర్శనతో కదంతొక్కింది. లీగ్లో ప్రథమార్ధంలో వరుస ఓటములతో కూనరిల్లిన ఆర్సీబీ…డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ను మట్టికరిపించింది. తమ సొంత ఇలాఖాలో అభిమానుల అశేష మద్దతు మధ్య చెన్నైతో నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో బెంగళూరు విజయఢంకా మోగించింది.
219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నైని 191 పరుగులకు పరిమితం చేస్తూ ప్లేఆఫ్స్లో ఆఖరి బెర్తును దక్కించుకుని ఔరా అనిపించుకుంది. ప్రాణంగా పోరాడిన మ్యాచ్లో ఆర్సీబీ సమిష్టి ప్రదర్శనతో విజృంభించింది. డుప్లెసిస్, కోహ్లీ బ్యాటింగ్తో 200ల మార్క్ అందుకున్న ఆర్సీబీ..చెన్నై బ్యాటర్లకు తమదైన రీతిలో కల్లెం వేసి టైటిల్ వేటలో కీలక దశకు చేరకుంది. ఈ క్రమంలో వరుసగా ఆరో విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఇక మిగిలింది టైటిల్ వేటే!
బెంగళూరు: ఐపీఎల్లో మరో చిరస్మరణీయ మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. ఆఖరి బంతి వరకు ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెడుతూ సాగిన మ్యాచ్లో ఆర్సీబీ అదరగొట్టింది. 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో సాగిన పోరులో బెంగళూరు విజయమో, వీర స్వర్గమో అన్నట్లు పోరాడింది. శనివారం జరిగిన అనధికారిక నాకౌట్ మ్యాచ్లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. తొలుత డుప్లెసిస్(39 బంతుల్లో 54, 3ఫోర్లు, 3సిక్స్లు), కోహ్లీ(29 బంతుల్లో 47, 3ఫోర్లు, 4సిక్స్లు) రాణించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 218/5 స్కోరు చేసింది. పాటిదార్(41), గ్రీన్(38 నాటౌట్) రాణించారు. శార్దుల్ (2/61), సాంట్నర్(1/23) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 191/7 స్కోరుకు పరిమితమైంది. రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 61, 5ఫోర్లు, 3సిక్స్లు), జడేజా(22 బంతుల్లో 42 నాటౌట్, 3ఫోర్లు, 3 సిక్స్లు) ఆకట్టుకున్నారు. యశ్ దయాల్(2/42), గ్రీన్(1/18) రాణించారు. డుప్లెసిస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
బెంగళూరు నిర్దేశించిన లక్ష్యఛేదనలో చెన్నైకి ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మ్యాక్స్వెల్ తొలి ఓవర్ మొదటి బంతికే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) డకౌట్గా వెనుదిరిగాడు. లీగ్లో సూపర్ ఫామ్మీదున్న గైక్వాడ్ ఔట్ కావడం చెన్నైని ఒకింత ఒత్తిడిలోకి నెట్టింది. ఫస్ట్డౌన్లో వచ్చిన మిచెల్(4) దయాల్ మూడో ఓవర్లో కోహ్లీ క్యాచ్తో రెండో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన రహానే(33) జతగా రచిన్ బ్యాటు ఝులిపించాడు. సిరాజ్ 4వ ఓవర్లో రచిన్, రహానే మూడు ఫోర్లతో 13 పరుగులు వచ్చాయి. అదే దూకుడు కనబరుస్తూ దయాల్ను కూడా మూడు ఫోర్లు అరుసుకోవడంతో పవర్ప్లే ముగిసే సరికి చెన్నై 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. లక్ష్యం దిశగా సాఫీగా సాగుతున్న తరుణంలో రహానే వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే(7), సాంట్నర్(3) నిరాశపర్చగా ఆఖర్లో జడేజా, ధోనీ గెలిపించేందుకు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. బ్యాటింగ్లో అదరగొట్టిన ఆర్సీబీ..బౌలింగ్, ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపించింది.
టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తాను ఎదుర్కొన్న రెండో బంతిని కోహ్లీ బౌండరీగా మలువగా, డుప్లెసిస్ ఫోర్, సిక్స్తో చెలరేగడంతో శార్దుల్ రెండో ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. తుషార్ వేసిన మరుసటి ఓవర్లో కోహ్లీ రెండో భారీ సిక్స్లతో విరుచుకుపడటంతో స్కోరుబోర్డుకు 13 పరుగులు జతకలిశాయి. అయితే మూడు ఓవర్లు ముగిసిన వెంటనే వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ 40 నిమిషాల పాటు ఆగిపోయింది. తిరిగి తెరిపినిచ్చిన తర్వాత ఆర్సీబీకి పరుగుల రాక మందగించింది. దీంతో పవర్ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. ఇక లాభం లేదనుకున్న కోహ్లీ, డుప్లెసిస్ గేర్ మార్చారు. సాంట్నర్ 10వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన కోహ్లీ..బౌండరీ వద్ద మిచెల్ క్యాచ్తో తొలి వికెట్గా వెనుదిరుగడంతో 78 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవైపు కోహ్లీ ఔటైనా డుప్లెసిస్ జోరు ప్రదర్శిస్తూ జడేజా బౌలింగ్లో ఓ ఫోర్, రెండు భారీ సిక్స్లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ కుదురుకుంటున్న తరుణంలో వివాదస్పద రీతిలో డుప్లెసిస్ రనౌట్గా వెనుదిరిగాడు. బౌలింగ్కు మార్పుగా వచ్చిన సిమర్జీత్సింగ్ను రజత్ పాటిదార్(41) రెండు ఫోర్లు, ఓసిక్స్తో స్వాగతం పలికాడు. డుప్లెసిస్ తర్వాత క్రీజులోకొచ్చిన కామెరూన్ గ్రీన్..పాటిదార్కు జతకలిశాడు. వీరిద్దరు ఇన్నింగ్స్ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. 18వ పరుగుల వద్ద గైక్వాడ్ క్యాచ్ విడిచిపెట్టడంతో గ్రీన్కు లైఫ్ లభించింది. శార్దుల్ బౌలింగ్లో సిక్స్కు ప్రయత్నించిన పాటిదార్..బౌండరీ వద్ద మిచెల్కు దొరికిపోయాడు. ఆ తర్వాత కార్తీక్(14), మ్యాక్స్వెల్(16)తక్కువ బంతుల్లో విలువైన పరుగులు సాధించడంతో ఆర్సీబీ 200 మార్క్ అందుకుంది.
బెంగళూరు: 20 ఓవర్లలో 218/5(డుప్లెసిస్ 54, కోహ్లీ 47, శార్దుల్ 2/61, సాంట్నర్ 1/23),
చెన్నై: 20 ఓవర్లలో 191/7(రచిన్ 61, జడేజా 42 నాటౌట్, దయాల్ 2/42, గ్రీన్ 1/18)