బెంగళూరు: ఓపెనర్లు దంచికొట్టడంతో ఐపీఎల్-16వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన రెండో పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (1), ఇషాన్ కిషన్ (10), కామెరూన్ గ్రీన్ (5), సూర్యకుమార్ యాదవ్ (15) విఫలమవడంతో ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (46 బంతుల్లో 84 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకున్నాడు. వరుస విరామాల్లో వికెట్లు పడగుతున్నా.. ఒంటరి పోరాటంతో ముంబైకి పోరాడే స్కోరు అందించాడు.
బెంగళూరు బౌలర్లలో కరణ్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 82; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (43 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో బెంగళూరు సునాయాసంగా విజయ తీరాలకు చేరింది. ఆరంభం నుంచే వీరిద్దరు దంచుడు కొనసాగించడంతో బెంగళూరు మరో 22 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. డుప్లెసిస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ముంబై: 171/7 (తిలక్ వర్మ 84 నాటౌట్, నిహాల్ 21; కరణ్ 2/32, సిరాజ్ 1/21), బెంగళూరు: 16.2 ఓవర్లలో 172/2 (కోహ్లీ 82 నాటౌట్, డుప్లెసిస్ 73; అర్షద్ 1/28, గ్రీన్ 1/30).