హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్సీఏ పరిపాలనకు పర్యవేక్షణ కమిటీ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మాజీ కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ బుధవారం..హెచ్సీఏపై తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో గురువారం జింఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కార్యదర్శి విజయానంద్, మాజీ ఉపాధ్యక్షుడు జాన్మనోజ్ పలు అంశాలపై మాట్లాడారు. ‘సుప్రీం తీర్పుతో రాబోయే కమిటీ పర్యవేక్షణలో సంఘం బాధ్యతలను హెచ్సీఏ సీఈవో చూసుకుంటారు. కోర్టు ఆదేశాలతో ఎనిమిది నెలల ముందే మా పదవీకాలం ముగిసింది. గత ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించిన క్లబ్ కార్యదర్శులకు కృతజ్ఞతలు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చాం. కానీ వాటిని పూర్తిగా నెరవేర్చనందుకు క్షమాపణలు కోరుతున్నాం. అధ్యక్షుడు అజారుద్దీన్తో ఎన్నిసార్లు సయోధ్యకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ మూడేండ్ల వ్యవధిలో బీసీసీఐ నుంచి రూ.40 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయి. బిల్ కట్టకపోవడంతోనే ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ చేశారు. దీనికి అధ్యక్షుడు అజర్దే పూర్తి బాధ్యత. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే కమిటీతో హెచ్సీఏ ముందుకెళ్లాలని అందరూ ఆశిస్తున్నారు’ అని విజయానంద్ అన్నారు.