ప్రతికూల పరిస్థితుల్లో భారత బ్యాటర్లు విజృంభించి తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయగా.. బౌలర్లు అదిరిపోయే ప్రదర్శనతో ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే పరిమి తం చేశారు. రెండో ఇన్నింగ్స్లోనూ ఫర్వాలేదనిపించిన టీమ్ఇండియా మంచి స్కోరే చేసి.. ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది! తొలి మూడు రోజులు భారత్ హవా సాగిన ఆఖరి టెస్టులో.. చివరి రెండో రోజులు అదరగొట్టిన ఇంగ్లండ్ మ్యాచ్ను సొంతం చేసుకుంది.
టెస్టు క్రికెట్కు అర్థం మారుస్తూ.. వీరబాదుడే పరమావధిగా వీరంగమాడుతున్న ఇంగ్లండ్.. తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి టైగర్ పటౌడీ సిరీస్ను ‘డ్రా’చేసుకుంది. రూట్, బెయిర్స్టో అజేయ శతకాలతో కదంతొక్కడంతో టీమ్ఇండియా నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది. అన్నీ విభాగాల్లో రాణించినా.. ఇంగ్లండ్ జోరు ముందు నిలువలేకపోయిన బుమ్రా సేన నిరాశగా సిరీస్ ముగించింది.
బర్మింగ్హామ్: మిడిలార్డర్ బ్యాటర్లు జో రూట్ (173 బంతుల్లో 142 నాటౌట్; 19 ఫోర్లు, ఒక సిక్సర్), జానీ బెయిర్స్టో (145 బంతుల్లో 114 నాటౌట్; 15 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీలు బాదడంతో భారత్తో జరిగిన ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఇటీవలి కాలంలో భారీ లక్ష్యాలను ఛేదించడాన్ని అలవాటుగా మార్చుకున్న ఇంగ్లిష్ జట్టు.. ఐదో టెస్టులో 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ను 2-2తో సమం చేసింది.
ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా నాలుగు మ్యాచ్లు ముగిసేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో కరోనా కలకలం రేగడంతో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుంది. మిగిలిపోయిన చివరి టెస్టును తాజాగా నిర్వహించగా.. కనీసం ‘డ్రా’చేసుకున్నా సిరీస్ చేజిక్కించుకునే సువర్ణ అవకాశం టీమ్ఇండియా ముందున్నా.. మనవాళ్లకు నిరాశ తప్పలేదు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ నయా కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో ఆలోచన లేకుండా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించగా.. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 416 పరుగులు చేసింది.
అనంతరం ఇంగ్లండ్ 284 రన్స్కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 245 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇంగ్లిష్ జట్టు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గేట్ ఛేదించింది. ఓవర్నైట్ స్కోరు 259/3తో మంగళవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా మ్యాచ్ను ముగించింది. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు కొట్టిన బెయిర్స్టోకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.. ఐదు మ్యాచ్ల్లో కలిపి 737 పరుగులు చేసిన జో రూట్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి. ఇక టెస్టు సమరం ముగియగా.. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
భారత్కు జరిమానా
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. ఇప్పటికే ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో పరాజయంతో సతమతమవుతున్న టీమ్ఇండియాకు.. స్లో ఓవర్రేట్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేసినందుకు భారత జట్టు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించిన ఐసీసీ.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ నుంచి రెండు పాయింట్లను తగ్గించింది.
1 టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్కు ఇదే (378) అత్యధిక పరుగుల లక్ష్యఛేదన.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 416, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284, భారత్ రెండో ఇన్నింగ్స్: 245, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 (రూట్ 142 నాటౌట్, బెయిర్స్టో 114 నాటౌట్; బుమ్రా 2/74).