ఆహా.. ఏమా మ్యాచ్.. ఏమా ఉత్కంఠ! అఫ్గాన్తో సిరీస్లో చూసేందుకు ఏముంటుందిలే అని ఊహించిన వాళ్ల అంచనాలను తప్పని నిరూపిస్తూ.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్లో టీమ్ఇండియాదే పైచేయి అయింది!
ఒక మ్యాచ్లో ఒక సూపర్ ఓవర్ చూస్తేనే సంబురపడిపోయే అభిమానులకు ఈ మ్యాచ్ విందు భోజనం వడ్డించింది.
సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే.. లంఘించి పంజా విసరబోతున్నట్లు.. గత రెండు మ్యాచ్ల్లో డకౌట్గా వెనుదిరిగిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్తో రికార్డుల దుమ్ము దులుపుతూ.. అజేయ శతకంతో కదం తొక్కితే.. తనలో ఫినిషర్తో పాటు మంచి యాంకర్ కూడా ఉన్నాడని అజేయ హాఫ్సెంచరీతో అండగా నిలిచిన రింకూ నిరూపించాడు.
22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ సమయంలో.. రోహిత్, రింకూ తమ హిట్టింగ్తో చిన్నస్వామి స్టేడియాన్ని మోత మోగిస్తే.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య రవి బిష్ణోయ్ రెండో సూపర్ ఓవర్లో చక్కటి బౌలింగ్తో మ్యాచ్ను భారత్ వశం చేశాడు. దీంతో టీమ్ఇండియా ఈ ఫార్మాట్లో తొమ్మిదో సిరీస్ క్లీన్స్వీప్ చేసి నయా చరిత్ర సృష్టించింది.
Rohit Sharma | బెంగళూరు: పొట్టి ప్రపంచకప్నకు ముందు ఆడిన చివరి టీ20లో భారత్ అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో ఒకటికి రెండు సూపర్ ఓవర్లు జరిగినా.. ఒత్తిడిని జయించిన టీమ్ఇండియాను విజయం వరించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి పోరులో భారత్ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించి 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. గత రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రతిఘటన కనబర్చలేకపోయిన అఫ్గాన్ ఈ సారి తుదికంటా పోరాడగా.. రోహిత్ రఫ్ఫాడించాడు. తొలుత టాస గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ (69 బంతుల్లో 121 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా.. నయా ఫినిషర్ రింకూసింగ్ (39 బంతుల్లో 69 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్సెంచరీతో సారథికి అండగా నిలిచాడు. అఫ్గాన్ పేసర్ ఫరీద్ అహ్మద్ (3/20) ధాటికి ఒక దశలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఈ జోడీ ఐదో వికెట్కు అజేయంగా 190 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 212 రన్స్ కొట్టింది. టాప్ త్రి రహ్మానుల్లా గుర్బాజ్ (50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (50; 4 ఫోర్లు, ఒక సిక్సర్), గుల్బదీన్ నైబ్ (55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేయగా.. మహమ్మద్ నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, దూబేకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
మ్యాచ్ టై కావడంతో ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా.. మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్థాన్ ఆరు బంతుల్లో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. ఛేదనలో రోహిత్ రెండు సిక్సర్లు బాదినా.. టీమ్ఇండియా కూడా 16 పరుగులకే పరిమితమైంది. దీంతో మరోసారి సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఈసారి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 11 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోగా.. చేజింగ్లో అఫ్గాన్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు చేజార్చుకొని పరాజయం వైపు నిలిచింది.
అఫ్గాన్: 1+వికెట్,1,4,1,6,3
భారత్: 1,1,6,6,1,1,
భారత్: 6,4,1,వికెట్, వికెట్
అఫ్గాన్: వికెట్,1, వికెట్
భారత్: 212/4 (రోహిత్ 121 నాటౌట్, రింకూ 69 నాటౌట్; ఫరీద్ 3/20),
అఫ్గానిస్థాన్: 212/6 (గుల్బదీన్ నైబ్ 55*, రహ్మానుల్లా 50; సుందర్ 3/18).