T20 World Cup 2024: ఈ ఏడాది జూన్లో అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉండాలని టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. 2022 టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత రోహిత్కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. హార్ధిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించారు. కానీ తాజాగా అతడికి గాయంతో రోహిత్ మళ్లీ టీ20లలోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ – 2024లో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగుతుందని వాదనలు వినిపించగా తాజాగా పాండ్యాకు గాయం, రోహిత్ రీఎంట్రీతో ఈ మెగా టోర్నీలో టీమిండియా ఎవరి సారథ్యంలో ఆడుతుందనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దాదా ఈ వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లీలు ఇద్దరూ పొట్టి ప్రపంచకప్లో ఆడాలని, ఈ ఇద్దరూ 14 నెలల విరామం తర్వాత అఫ్గానిస్తాన్తో సిరీస్ ఆడుతున్నా.. వచ్చిన నష్టమేమీ లేదని, ఆ ఇద్దరూ రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. పీటీఐతో మాట్లాడుతూ దాదా తెలిపాడు.
గంగూలీ మాట్లాడుతూ… ‘టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండాలి. విరాట్ కోహ్లీ కూడా ఆ జట్టులో ఉండాలి. కోహ్లీ అద్భుతమైన ప్లేయర్. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ టీ20 క్రికెట్ ఆడుతున్నా ఈ ఇద్దరూ రాణించగలరు..’ అని అన్నాడు. 2022 నవంబర్లో ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లండ్తో ముగిసిన టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓడిన తర్వాత రోహిత్, కోహ్లీలు అంతర్జాతీయ స్థాయిలో టీ20లు ఆడలేదు. తాజాగా ఈ ఇద్దరినీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. అఫ్గాన్తో ఈనెల 11 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఎంపికచేసింది.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పైనా గంగూలీ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా వేదికగా ఇటీవలే ముగిసిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో జైస్వాల్ విఫలమైనా అతడు కెరీర్ ఆరంభంలోనే ఉన్నాడని, రాబోయే రోజుల్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్కు మరిన్ని అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.